కంట్లో కారం కొట్టి వెనక్కి పంపారు: సుప్రీంకోర్టుకు బిందు: ముదురుతోన్న శబరిమల వివాదం
న్యూఢిల్లీ: శబరిమల వివాదం మళ్లీ రాజుకుంటోంది. సుప్రీంకోర్టు గడప తొక్కింది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘనకు దారి తీస్తున్నాయంటూ ఫిర్యాదులు, పిటీషన్లు సుప్రీంకోర్టు అందాయి. మొన్నటికి మొన్న శబరిమల ఆలయానికి వెళ్తూ.. పెప్పర్ స్ప్రే దాడికి గురైన బిందు అమ్మిని సైతం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘన కొనసాగుతోందని, శబరిమలకు వెళ్లే మహిళా భక్తులకు అక్కడి ప్రభుత్వం ఏ మాత్రం రక్షణ కల్పించట్లేదని ఆమె పిటీషన్ దాఖలు చేశారు.
వద్దని చెప్పలేదుగా.. శబరిమల వెళ్తా: తృప్తి దేశాయ్: సన్నిధానంలో మహిళలకు ప్రవేశం మాటేంటీ?
అయ్యప్పమాలను ధరించి, శబరిమలకు వెళ్లడానికి ప్రయత్నించిన బిందు అమ్మినిని భక్తులు అడ్డగించిన విషయం తెలిసిందే. భూదేవి బ్రిగేడ్ సంస్థ చీఫ్ తృప్తి దేశాయ్ నేతృత్వంలో శబరిమల ఆలయానికి వెళ్లడానికి వచ్చిన బిందు అమ్మినిపై ఎర్నాకుళం పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద దాడి చోటు చేసుకుంది. శ్రీనాథ్ పద్మనాభన్ అనే వ్యక్తిపై ఆమెపై పెప్పర్ స్ప్రేతో దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడ్డ బిందు అమ్మిని ఆసుపత్రిలో చికిత్స పొందారు.
ఆ వెంటనే- ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వయస్సుతో నిమిత్తం లేకుండా, మహిళలు అందరూ శబరిమల ఆలయానికి వెళ్లొచ్చని, అయ్యప్ప స్వామిని దర్శించుకోవచ్చంటూ గత ఏడాది సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై దాఖలైన రివ్యూ పిటీషన్లను విచారణకు స్వీకరించిన అదే సుప్రీంకోర్టు.. ప్రస్తుతం తుది ఆదేశాలను ఇవ్వలేదు. పెండింగ్ లో ఉంచింది. దీనితో శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై యధాతథ స్థితి కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో బిందు అమ్మిని శబరిమల ఆలయానికి వెళ్లడానికి విఫలయత్నం చేశారు. అక్కడ తనపై దాడి చోటు చేసుకోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. పిటీషన్ ను దాఖలు చేశారు. మహిళలకు రక్షణ కల్పించాలని ఆమె న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఇదివరకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశాన్ని కల్పించేలా కేరళ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని, మహిళలపై దాడి చోటు చేసుకోకుండా ఉండటానికి భద్రత కల్పించాలని కోరారు.