మహిళల కడుపులో బంగారం: పోలీసుల అదుపులో ఉన్న మహిళలను సినీ ఫక్కీలో ఎత్తుకెళ్ళి ...
సినీ ఫక్కీలో జరుగుతున్న బంగారం స్మగ్లింగ్ దేశంలో బంగారం స్మగ్లింగ్ గ్యాంగ్ లు ఎలా రెచ్చిపోతున్నాయో తేటతెల్లం చేస్తుంది. దేశ వ్యాప్తంగా ఎయిర్ పోర్ట్ లలో భద్రతా ప్రమాణాలు ఎంతగా తీసుకున్నా, అనునిత్యం తనిఖీలు జరుగుతున్నా ఎయిర్ వేస్ మార్గంగా బంగారం అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతుంది. ఏకంగా కడుపులో బంగారం పెట్టుకుని మహిళలే బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన ఘటన చెన్నై విమానాశ్రయంలో జరిగింది. అంతేకాదు ఈ కేసులో జరిగిన కీలక ట్విస్ట్ లు అందర్నీ అవాక్కయ్యేలా చేశాయి.
చెన్నై విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ ఘటనలు
గత కొద్ది రోజుల నుంచి చెన్నైలో భారీగా బంగారం పట్టుబడుతోంది. మొన్నటికి మొన్న ఒక ఫ్లైట్ టాయిలెట్ లో 5.6 కేజీల 2.24 కోట్ల విలువ గల భారీగా బంగారం లభించగా తాజాగా కడుపుతో ఉన్నట్టు నటిస్తూ కడుపులో మూడు కిలోల బంగారం దాచుకుని స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు మహిళల గుట్టు రట్టైంది. వీడొక్కడే సినిమా తరహాలోనే జరిగిన ఈ బంగారం స్మగ్లింగ్ అటు పోలీసులకు, ఇటు జనాలకు ఆసక్తిగా మారింది.
కడుపులో మూడు కిలోల బంగారంతో స్మగ్లింగ్ కు యత్నించిన మహిళలు
శ్రీలంక నుండి వచ్చిన ఫ్లైట్ లో కడుపులో 3 కిలోల బంగారం అక్రమంగా తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు ఇద్దరు మహిళలు. అయితే మొదట ఎయిర్ పోర్ట్ లో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు గర్బం దాల్చారేమోనని భావించారు. కానీ అనుమానంతో తనిఖీలు చేసిన అధికారులకు దిమ్మ తిరిగే విషయం తెలిసింది. మహిళలు ఏకంగా క్యాప్సూల్స్ రూపంలో కడుపులో బంగారం పెట్టుకుని స్మగ్లింగ్ కు పాల్పడుతున్నట్టు గుర్తించారు అధికారులు . ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని వారి కడుపులో నుండి బంగారం బయటకు తియ్యటానికి ఆస్పత్రికి తరలిస్తుండగా ఊహించని ట్విస్ట్ జరిగింది.
పోలీసుల అదుపులో ఉన్న మహిళలను కిడ్నాప్ చేసిన గ్యాంగ్
10 మంది దుండగులు ఆ ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి కడుపులో ఉన్న బంగారాన్ని బయటకు తీసి ఆ బంగారాన్ని దోచేసి వారిని వదిలిపెట్టారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ అరెస్ట్ , కిడ్నాప్ మరియు బంగారం దోపిడీ ఘటనపై కస్టమ్స్ అధికారులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఎయిర్ పోర్ట్ పోలీసుల అదుపులో ఉన్న వారిని స్మగ్లింగ్ ముఠా కిడ్నాప్ చెయ్యటం అందర్నీ నివ్వెరపరిచింది. అయితే ఈ మహిళలను స్మగ్లర్లు పావులుగా వాడుకుని ఈ తరహా బంగారం సంగ్లింగ్ కు పాల్పడుతున్నారా ? అసలు వీరిని కిడ్నాప్ చేసింది , వీరి వద్ద ఉన్న 3 కిలోల బంగారాన్ని దోచేసింది వీరికి తెలిసిన సదరు ముఠా సభ్యులేనా ? అన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్పత్రికి తీసుకెళ్ళి బంగారం దోచేసిన స్మగ్లింగ్ ముఠా
అసలు ఎవరూ ఊహించని విధంగా సినిమా ఫక్కీలో మహిళలను ఆస్పత్రికి తీసుకెళ్తున్న పల్లావరం మార్గంలో కస్టమ్స్ అధికారుల కారును రోడ్డుపై అడ్డగించి ఆ ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేశారు. వారిని చెంగల్పట్టులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు ముఠాలోని సభ్యులు. అక్కడ ఎనిమా నిర్వహించి వారి కడుపులో ఉన్న బంగారం తీసేసుకున్నారు. ఆపై మీనంబాక్కం సమీపంలో ఫాతిమా, థెరిసాలను విడిచిపెట్టి స్మగ్లింగ్ ముఠా సభ్యులు పారిపోయారు.
షాకింగ్ ట్విస్ట్ ల గోల్డ్ స్మగ్లింగ్ లో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న ఎయిర్ పోర్ట్ పోలీసులు
అయితే ఇద్దరు మహిళలు నేరుగా పోలీస్స్టేషన్కు వెళ్లి కిడ్నాప్ ఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటన చెన్నైలో కలకలం రేపింది. బలమైన ముఠా కాబట్టే ఇలా కిడ్నాప్ చేశారని వాదన వినిపిస్తోంది. ముఠా కోసం అటు కస్టమ్స్ ఇటు పోలీసులు వేట సాగిస్తున్నారు. షాకింగ్ ట్విస్ట్ లతో ఉన్న ఈ ఉదంతంలో మహిళలు సంగ్లింగ్ కు నేరుగా పాల్పడుతున్నారా ? లేకా వీరు కూడా ముఠా సభ్యులా ? వీరు కడుపులో బంగారం పెట్టుకుని ఎవరికి చేరవెయ్యటానికి వెళ్తున్నారు. అసలు వీళ్ళు ఎవరు.. వీళ్ళను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు .. అన్న అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.