కోర్టు అనుమతి అక్కర్లేదు: అభీష్ట శృంగారంపై రేణుక
న్యూఢిల్లీ: పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనే విషయంలో మేజరైన మహిళలకు కోర్టుల అనుమతి అవసరం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి అన్నారు. ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కొందరు యువతులు మొదట్లో శృంగారానికి అంగీకరించి ఆ తర్వాత అత్యాచారానికి గురయ్యామని ఫిర్యాదులు చేస్తున్నారని ఓ కేసు విషయంలో ఢిల్లీ కోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆమె పై విధంగా స్పందించారు.
అత్యాచారానికి, అంగీకార శృంగారానికి మధ్య చాలా తేడా ఉందని రేణుకా చౌదరి అన్నారు. కోర్టు తీర్పుతో మహిళలు అయోమయానికి లోనుకావొద్దని ఆమె సూచించారు. అయితే తాను కోర్టు తీర్పుపై వ్యాఖ్యానించదల్చుకోలేదని చెప్పారు. మొదట అంగీకారంతో శృంగారంలో పాల్గొని ఆ తర్వాత అత్యాచారానికి గురైనట్లు ఫిర్యాదులు చేస్తున్నారనడం సరికాదన్నారు.
అత్యాచారం అంటే అది క్రూరమైనదని, అత్యాచారంలో మహిళ ఆక్రమణకు గురవుతోందని ఆమె తెలిపారు. వైవాహిక జీవితంలో కూడా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 18 సంవత్సరాలు నిండిన యువతులు తమ అంగీకారంతో శృంగారంలో పాల్గొనేందుకు ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని, కోర్టు ఆమోదం కూడా అవసరం లేదని రేణుకా చౌదరి అన్నారు.
ఇంతకుముందు కూడా అత్యాచారాలపై రేణుకా చౌదరి స్పందించారు. అమ్మాయిలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడిన నిందితులను గొంతు పిసికి చంపేద్దామన్నంత కోపం తనకు ఉందని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సమాజం కలసికట్టుగా ఆడవాళ్లనే బాధ్యులను చేస్తోందని ఆమె తప్పుబట్టారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మహిళలపై ఆంక్షలు విధించడం సరికాదని ఆమె అన్నారు.