అమ్మ కోసం కూతురి ఆరాటం.. ప్రియుడితో పెళ్లి వద్దనుకుని కిడ్నీ దానం..
బెంగళూరు : అవయవదానం.. ఒక మనిషి ప్రాణాలు కాపాడుతుంది. అందుకే అన్ని దానాల్లోకెల్లా అవయవదానం గొప్పదంటారు. అయితే పెళ్లి కాని వారు ఆర్గాన్ డొనేషన్కు ముందుకు రావడం చాలా అరుదు. బంగ్లాదేశ్కు చెందిన ఓ యువతి మాత్రం తల్లి కోసం తన కిడ్నీ దానం ఇచ్చింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన వ్యక్తిని వదులుకునేందుకు సిద్ధమైంది. నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని మరీ అమ్మ ప్రాణాలు కాపాడింది.
బంగ్లాదేశ్కు చెందిన 25 ఏళ్ల యువతి ఓ వ్యక్తిని ప్రేమించింది. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. ఈ నెల 21న నిశ్చితార్థం చేసుకోవాలనుకున్నారు. అయితే ఇంతలో ఊహించని సంఘటన జరిగింది. యువతి తల్లి కిడ్నీలు పూర్తిగా పాడవడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు వెంటనే కిడ్నీ మార్పిడి చేయాలని చెప్పారు. దీంతో సదరు యువతి అమ్మకు తన కిడ్నీ ఇచ్చేందుకు ముందుకొచ్చింది.
తల్లికి కిడ్నీ ఇస్తానన్న విషయాన్ని కాబోయే భర్తకు చెప్పింది. అయితే అతడు ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. కిడ్నీ దానం ఇస్తే భవిష్యత్తులో సమస్యలు వస్తాయని నచ్చజెప్పాడు. అయితే తల్లి కన్నా తనకు ఏమీ ఎక్కువ కాదన్న యువతి ప్రియుడితో పెళ్లి వద్దనుకుంది. ఎంగేజ్మెంట్ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని బెంగళూరుకు వచ్చింది. తన నిర్ణయాన్ని తల్లికి ట్రీట్మెంట్ ఇస్తున్న నెఫ్రాలజిస్ట్ సుందర్కు చెప్పింది. అయితే భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశమున్నందున డాక్టర్ సైతం ఆమెకు కౌన్సిలింగ్ చేశాడు. అయినప్పటికీ తన నిర్ణయాన్ని మార్చుకోని యువతి అమ్మకు కిడ్నీ ఇస్తానని తేల్చిచెప్పింది.
కిడ్ని దానం కోసం బంగ్లాదేశ్ యువతి నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకున్న విషయాన్ని డాక్టర్ సుందర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్గా మారింది. యువతి నిర్ణయాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసించారు. తల్లి కోసం పెళ్లి వద్దనుకున్న కూతురు ఉన్న ఆ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో అని మెచ్చుకుంటున్నారు. కూతురు తీసుకున్న నిర్ణయానికి ఆమె తండ్రి గర్వంగా ఫీలవుతున్నాడు. తనకు ఇద్దరు కూతుళ్లే ఉండటంపై చాలా మంది అనేక రకాలుగా మాట్లాడటంతో బాధపడేవాడినని, అయితే ఇప్పుడు కూతురే తన భార్య ప్రాణాలు కాపాడుతుండటంతో సంతోషంతో కళ్లు చెమర్చుతున్నాయని అంటున్నాడు.