సున్నితం..భావోద్వేగం: అగ్నికి ఆజ్యం పోయలేం: శబరిమలపై సుప్రీంకోర్టు: ఆ ఇద్దరి పిటీషన్లపై..!
న్యూఢిల్లీ: చారిత్రాత్మక శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రతికూల నిర్ణయాన్ని వెలువడించింది. శబరిమలలో ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించడమనే అంశం.. అత్యంత సున్నితమైనదని, కోట్లాదిమంది భక్తుల మనోభావాలు, వారి భావోద్వేగాలతో ముడిపడి ఉన్నదని పేర్కొంది. మహిళలకు శబరిమల ఆలయంలో ప్రవేశాన్ని కల్పిస్తూ ఈ అంశాన్ని మరింత క్లిష్టతరం చేయలేమని స్పష్టం చేసింది.
ఆ ఇద్దరి పిటీషన్లపై..
కేరళ పత్తినంథిట్ట జిల్లాలోని దట్టమైన అడువుల్లో వెలసిన అయ్యప్పస్వామి ఆలయంలో అన్ని వయస్కుల మహిళలకు ప్రవేశం లేదనే విషయం తెలసిందే. అయ్యప్ప స్వామి బ్రహ్మచారి కావడం వల్ల పదేళ్ల నుంచి 50 సంవత్సరాల మధ్య గల మహిళలకు ఆలయంలో ప్రవేశంపై నిషేధం కొనసాగుతోంది. ఇది ఆలయ ఆనవాయితీ. దీన్ని సవాల్ చేస్తూ బిందు అమ్మిని, రెహానా ఫాతిమా అనే ఇద్దరు మహిళలు సుప్రీంకోర్టులో కొద్దిరోజుల కిందటే పిటీషన్ ను దాఖలు చేశారు.
ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం..
ఈ పిటీషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బొబ్డె, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ విచారణ చేపట్టారు. విచారణకు స్వీకరించిన కొద్దిసేపటికే తమ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ అంశంపై తాము ఇప్పటికిప్పుడు ఎలాంటి తీర్పును కూడా ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుతం ఈ విషయం దాఖలైన రివ్యూ పిటీషన్లను ఏడుమంది సభ్యులు గల ధర్మాసనం విచారించాల్సి ఉందని, అప్పటిదాకా మహిళలకు ప్రవేశాన్ని కల్పిస్తూ తీర్పు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
రివ్యూ పిటీషన్లపై తుది తీర్పు పెండింగ్ లో..
నిజానికి- అయ్యప్పస్వామి ఆలయంలోనికి మహిళలకు ప్రవేశాన్ని కల్పిస్తూ గత ఏడాదే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసింది. నాటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సారథ్యంలో ఏర్పాటైన అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. రివ్యూ పిటీషన్లపై విచారణ ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నందున గత ఏడాది ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ.. మరోసారి తాజా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బిందు అమ్మిని, రెహానా ఫాతిమా పిటీషన్లు వేశారు.
మహిళలకు ప్రవేశాన్ని కల్పించడాన్ని నిరసిస్తూ..
ఆ తరువాత కేరళలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. లక్షలాదిమంది మణికంఠుడి భక్తులు రోడ్ల మీదకి వచ్చారు. స్వచ్ఛందంగా ఆందోళనలు చేశారు. మహిళలు ఆలయ ప్రవేశం చేయకుండా రక్షణగా నిల్చున్నారు. ఈ అంశంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో 69 రివ్యూ పిటీషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ ఒకే కేసు కింద తీసుకుని కిందటి నెలలో విచారణ చేపట్టింది.
మసీదుల్లో కూడా..
అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ సారథ్యంలోని అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం.. తన నిర్ణయాన్ని పెండింగ్ లో ఉంచింది. ఏడుమంది సభ్యుల ధర్మాసనానికి పంపించింది. ఒక్క ఆలయంలోనే ప్రవేశాన్ని ఎందుకు కల్పించాల్సి ఉందని, మహిళలకు మసీదుల్లో కూడా ప్రవేశం లేదని, ఈ అంశాన్ని కూడా విచారించాలనే ఉద్దేశంతోనే దీన్ని ఏడుమంది సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసింది.