దారుణం: తుపాకీతో బెదిరించి మహిళలపై సామూహిక అత్యాచారం
జార్ఖండ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ అవగాహన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఐదుగురు మహిళలను కొందరు దుండగులు తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళలతో పాటు తోడుగా వచ్చిన ఒక మగమనిషిని కొట్టి తీవ్రంగా గాయపరిచారు.
జార్ఖండ్ రాజధాని రాంచీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొచాంగ్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. మనుషుల అక్రమ రవాణాపై అవగాహన పెంచేందుకు 11 మంది సభ్యులున్న ఓ బృందం కొచాంగ్కు వెళ్లింది. అవగాహనా కార్యక్రమంలో నిమగ్నమై ఉండగా కొందరు ఆయుధాలతో బైకులపై వచ్చి అక్కడ ఓ వ్యక్తిని చితకబాది బృందంలోని మహిళలను ఎత్తుకెళ్లారు.మూడుగంటల తర్వాత అడవిలో వారిని వదిలేశారు.వీరితో పాటు ఇద్దరు నన్స్ని దుండగులు ఏమీ చేయకుండా వదిలేశారు.
అత్యాచార ఘటనను దుండగులు వీడియో చిత్రీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. బయట చెబితే వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేస్తామని బెదిరించినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. మహిళలను ఆస్పత్రికి తరలించగా వారిపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ దారుణానికి పాల్పడ్డ వారు పతల్గడి అనే గిరిజన వర్గానికి చెందినవారిగా తెలుస్తోంది. ఈ తెగకు చెందిన వారు రాష్ట్రంలో అమలయ్యే నిబంధనలు పాటించరు. వారికంటూ నిర్దేశించుకున్న గిరిజన నియమనిబంధనల కిందే గ్రామ పాలన జరుగుతుంది. బయటి వ్యక్తులను తమ గ్రామాల్లోకి ప్రవేశించేందుకు అనుమతించరని పోలీసులు వివరించారు.