బుర్ఖాల మాటున పురుష ఓటర్లు: ప్రతి ఓటరునూ తనిఖీ చేయాలి: బీజేపీ ఎంపీ అభ్యర్థి
లక్నో: రెండో దశ పోలింగ్ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ లోని కొన్ని లోక్ సభ నియోజకవర్గాల్లో అనర్హులు ఓటు వేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరు పురుష ఓటర్లు బుర్ఖాలు వేసుకుని పోలింగ్ కేంద్రాలకు వెళ్లి, ఓటు వేస్తున్నారని బీజేపీ లోక్ సభ అభ్యర్థి ఒకరు ఆరోపించారు. బుర్ఖాలు ధరించిన వారిని ఎందుకు తనిఖీ చేయట్లేదని ఆయన ప్రశ్నించారు. బుర్ఖాల మాటున ఎవరు ఉన్నారో కూడా తెలియట్లేదని ఆయన చెప్పారు.
రెండో దశ పోలింగ్ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ లో ఎనిమిది లోక్ సభ స్థానాలకు గురువారం పోలింగ్ జరుగుతోంది. అమ్రోహ లోక్ సభలో అనర్హులు ఓటు వేస్తున్నారని బీజేపీ అభ్యర్థి కన్వర్ సింగ్ తన్వర్ ఆరోపించారు. అమ్రోహా నియోజకవర్గం పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నట్లు తనకు ఫిర్యాదులు అందాయని అన్నారు.
కొందరు పురుషులు బుర్ఖాలు వేసుకుని పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నారని చెప్పారు. దీన్ని ప్రత్యక్షంగా చూసిన తన పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. బుర్ఖాలు వేసుకుని వచ్చే మహిళా ఓటర్లను తనిఖీ చేయడానికి ఎలాంటి వ్యవస్థా లేదని, దీన్ని సాకుగా తీసుకుని అనర్హులు ఇష్టానుసారంగా ఓటు వేస్తున్నారని అన్నారు. ముఖం కప్పుకొని రావడం వల్ల నిజమైన ఓటర్లా? కాదా? అనే విషయాన్ని పోలింగ్ సిబ్బంది తేల్చుకోలేక పోతున్నారని చెప్పారు.
ఈ ఆరోపణలను మహాకూటమి అభ్యర్థి డానిష్ అలీ తోసిపుచ్చారు. ఇలాంటి ఘటనలేవీ చోటు చేసుకోవట్లేదని అన్నారు. ఓటమి భయంతోనే కన్వర్ సింగ్ ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా చేస్తున్నారని, పోలింగ్ శాతాన్ని తగ్గించడానికి కన్వర్ సింగ్ కట్టుకథలు అల్లుతున్నారని ఆరోపించారు.
ఈ నెల 11వ తేదీన చోటు చేసుకున్న తొలి దశ పోలింగ్ సందర్భంగా కూడా బీజేపీ అభ్యర్థులు కొందరు ఇలాంటి ఆరోపణలను చేశారు. ముజప్ఫర్ నగర్ లోక్ సభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సంజీవ్ బలియాన్ కూడా బుర్ఖాలపై వివాదాస్పద ప్రకటన చేశారు. బుర్ఖాలు వేసుకుని ఓటు వేయడానికి అనుమతి ఇవ్వకూడదని, ఇచ్చినా, వారిని కూడా తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు.