ఎన్డీఆర్ఎఫ్ లో మహిళలు .. విపత్తులపై పోరాటం, విధుల్లో 100 మందితో కూడిన మొదటి దళం
ఆకాశంలో సగం ,అవనిలో సగం మాత్రమే కాదు, అవకాశం ఇస్తే పురుషులకు ఏ మాత్రం తీసిపోమని నిరూపించారు మహిళలు. తాజాగా జాతీయ విపత్తు నిర్వహణా దళంలోకి ప్రవేశించిన మహిళలు మేము సైతం అంటూ తమ సత్తాను నిరూపించుకునే పనిలో పడ్డారు. ఇప్పటివరకు ఎన్ డి ఆర్ ఎఫ్ లో కేవలం పురుషులు మాత్రమే పని చేసేవారు. కానీ ఇకనుండి జాతీయ విపత్తు నిర్వహణ దళంలో మహిళలు సైతం తమ సత్తాను చాటనున్నారు.
భారత చరిత్రలోనే తొలిసారి .. భారత్ - పాక్ ఎల్ఓసీ వద్ద విధుల్లో మహిళా సైన్యం
ఉత్తర ప్రదేశ్లోని గర్హ్ ముక్తేశ్వర్ పట్టణంలో విధుల్లోకి మహిళా రెస్క్యూ టీమ్
అందులో భాగంగా 100 మందితో కూడిన మొదటి మహిళా బృందం విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని ఎన్డీఆర్ఎఫ్ దళంలోకి చేరింది.ఇక తాజాగా శిక్షణ పొందిన ఈ బృందం అప్పుడే రంగంలోకి కూడా దిగింది. ఉత్తర ప్రదేశ్లోని గర్హ్ ముక్తేశ్వర్ పట్టణంలోని గంగా నది ఒడ్డున వారు విధులను నిర్వహిస్తున్నారు. వంద మంది మహిళా బృందంతో కూడిన ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందిని ఇటీవల ఉత్తరప్రదేశ్లోని ముక్తేశ్వర్ పట్టణంలో గంగానది ఒడ్డున విధుల్లో నియమించినట్లు సీనియర్ ఫోర్స్ అధికారి తెలిపారు.
అన్ని నైపుణ్యాలతో మహిళా రెస్క్యూ టీమ్ రెడీ : ఎన్డిఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్
ఈ బృందం రెస్క్యూ బోట్లు మరియు విపత్తుకు సంబంధించిన పరికరాలను నిర్వహించడమే కాకుండా, మహిళలను రక్షించడం, మహిళలకు సహాయం చేయడం, అత్యవసర పరిస్థితుల్లో వారికి కావలసిన మౌలిక సదుపాయాలను కల్పించే దిశగా ప్రయత్నం చేయడం చేస్తారని, అందులో వీరికి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చామని ఎన్డిఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ చెప్పారు .ఈ మహిళా సిబ్బందికి సంపూర్ణంగా రక్షించడానికి కావలసిన అన్ని నైపుణ్యాలు ఉన్నాయి అని ఆయన చెప్పారు.
ఎన్డిఆర్ఎఫ్లో 100 మందికి పైగా మహిళా సిబ్బంది
ఎన్డిఆర్ఎఫ్ పోరాట బృందాలలో మహిళా సిబ్బందిని తీసుకునే చర్య కొంతకాలంగా పరిశీలనలో ఉంది. గత కొన్ని నెలలుగా 100 మందికి పైగా మహిళా సిబ్బంది ఎన్డిఆర్ఎఫ్లో చేరారు . వారు తమ ప్రీ-ఇండక్షన్ కోర్సు మరియు శిక్షణను పూర్తి చేసిన వెంటనే దేశవ్యాప్తంగా దాని బెటాలియన్లలో నియమించబడ్డారు అని డిజి తెలిపారు. సమీప భవిష్యత్తులో ఈ సంఖ్య 200 మంది మహిళా సిబ్బందికి పెంచే ఆలోచనలో ఉన్నట్లుగా పేర్కొన్నారు.
విపత్తులపై పోరాటంలో మగువలు సైతం
ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ లో చేరిన మహిళా సిబ్బంది సబ్ ఇన్స్పెక్టర్ మరియు ఇన్స్పెక్టర్ ర్యాంకులలో ఉన్నారు. విపత్తు బాధితులను రక్షించడంలో మరియు విపత్తు తగ్గించడంలో కూడా మహిళా సిబ్బంది తమ సత్తా చాటుతారని డీజీ పేర్కొన్నారు . విపత్తు పోరాటంలో మొదటి మహిళా బృందానికి స్పందన బాగుందని , వారు మంచి పనితీరు కనబరుస్తున్నారని పేర్కొన్నారు.