భర్త చేసిన తప్పుకు భార్యను తంతారా.. మహిళ పోలీసు తీరుపై కోర్టు సీరియస్.. అబార్షన్కి కారణం ఎవరు .?
భువనేశ్వర్ : ఆమె ఓ పోలీసు అధికారి. ఉన్నత స్థానంలో ఉన్న ఆఫీసర్. నేరం చేసిన వారిపై చర్యలు తీసుకునే క్రమంలో తానే మహిళననే విషయం మరచిపోయారు. నిందితుడి ఆచూకీ చెప్పాలని సాటి మహిళపై బూటుకాలితో తన్ని తనలోని మృగాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఒడిశాలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. మహిళా పోలీసు ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళై ఉండి .. సాటి మహిళపై బూటుకాలితో తన్నడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇది సరికాదని .. ఆమెపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రమాదంతో మొదలై ..
గత నెల 3న సుందర్గఢ్ జిల్లా కణిక గ్రామంలో కారు ఢీ కొని యువకుడు చనిపోయాడు. దీనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసు స్టేషన్ వద్ద విధ్వంసానికి పాల్పడ్డారు. దీంతో ఎస్పీ రంగంలోకి దిగారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు రంగంలోకి దిగారు. నిందితుల్లో ఒకరైన ఉత్తమ్ డే ఇంటికొచ్చారు మహిళా ఎస్పీ సౌమ్య మిశ్రా .. అయితే అక్కడ ఆయన లేకపోవడంతో ఆగ్రహానికి గురయ్యారు. ఆయన ఆచూకీ తెలుపాలని భార్యను అడిగారు. తనకేం తెలియదని చెప్పడమే ఆమె పాపమైపోయింది. మరికొద్దిరోజుల్లో అనుభవించే మాతృత్వపు మాధుర్యాన్ని మహిళా ఎస్పీ దాడితో దూరమైపోయింది.
మహిళనని మరచి ..
ఉత్తమ్ డే ఆచూకీ తెలుపాలని ఎస్పీ సౌమ్య మిశ్రా అడిగారు. తనకు తెలియదని ఆమె చెప్పడంతో పట్టరాని కోపం వచ్చింది ఎస్పీకి. ఆగ్రహానికి గురైన ఎస్పీ .. మహిళ అని కాదు కదా .. గర్భవతి అని కూడా చూడలేదు. పొత్తి కడుపుపై తన్నడంతో గర్భవతి అయిన ఆమె హాహాకారాలు చేసింది. ఆ సమయంలో ఆమె రోదన అరణ్యరోదన. తన మాతృత్వాన్ని మాధుర్యాన్ని మహిళా ఎస్పీ చిదిమివేసిందని బాధితురాలు వాపోయింది. తన భర్త చేసిన తప్పుకు తనను ఎందుకు శిక్షించారని ప్రశ్నించింది. ఇది సరికాదని .. సౌమ్యమిశ్రాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
న్యాయం కోసం ..
తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరుగొద్దని భావించింది. ఈ ఘటనపై ఒడిశా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఓ మహిళా ఎస్పీపై కఠినచర్యలు తీసుకోవాలని వేడుకుంది. ఈ పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం .. మహిళా ఎస్పీ మీద క్రిమినల్ కేసు నమోదుచేయాలని ఆదేశించారు. మేజిస్ట్రేట్ ఆదేశాలతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. సౌమ్య మిశ్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని .. డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తామని వివరించారు. సాటి మహిళపై దాడిని మేధావులు, పౌరసమాజం ఖండిస్తోంది. ఇలాంటి ఘటన మరొటి జరగొద్దంటే .. ఆ మహిళా ఎస్పీపై తీవ్ర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.