భక్తుల ముసుగలో దాడులు: శబరిమలైలో ఇద్దరి మహిళా జర్నలిస్టులపై దాడి
కేరళ: కేరళ రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా తయారైంది. శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళుతున్న మహిళలపై ఆందోళనకారులు దాడులు చేశారు. వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే అక్కడి ఘటనలను కవర్ చేసేందుకు వెళ్తున్న ఇద్దరు మహిళా జర్నలిస్టులపై ఆందోళనకారులు దాడి చేశారు. వీరిద్దరిలో ఒకరు ప్రముఖ జాతీయ ఛానెల్ రిపబ్లిక్ టీవీ రిపోర్టర్ కాగా మరొకరు న్యూస్ మినిట్ రిపోర్టర్. ఇదిలా ఉంటే 10 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు మహిళలకు ఆలయంలోకి ప్రవేశం ఉండేది కాదు. అయితే ఆలయంలోకి మహిళలు కూడా ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ఆలయంలోకి మహిళల వెళుతుండగా అక్కడి కొన్ని మహిళా సంఘాలు అడ్డుకున్నట్లు న్యూస్ మినిట్ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బస్సులో ఆలయం దగ్గరకు వెళుతుండగా కర్మ సమితికి చెందిన 20 మంది పురుషులు వచ్చి బస్సును అడ్డుకుని మహిళా జర్నలిస్టు సరితా బాలన్ను బయటకు లాగారు.అంతేకాదు ఆమెను దూషించారని న్యూస్ మినిట్ రిపోర్ట్ తెలిపింది. మరొకరు ఆమెపై దాడి చేసినట్లు సమాచారం. గుంపులో ఒక వ్యక్తి ఆమె వెన్నెముకపై కాలుతో తన్నినట్లు తెలుస్తోంది.
సరితా బాలన్పై దాడి చేస్తున్న సమయంలో పలువురు ఆమె ఫోటోలను తీసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయ్యప్ప స్వామికి సంబంధించి మంత్రాలు చదివారని వారు చెప్పారు. ఆమెను పలు పేర్లతో దూషించి ఇబ్బంది పెట్టారని వారు చెప్పారు. అదే గుంపులో ఉన్న మరో మహిళ సరితపై వాటర్ బాటిల్ విసిరిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ప్రస్తుతం సరితా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. భక్తులు అని చెప్పుకుంటున్న కొందరు రౌడీలు కూడా అక్కడే స్టేషన్లో ఉన్నారు.
#Kerala:Protesters block and attack a woman journalist's car in Pathanamthitta #SabarimalaTemple pic.twitter.com/7TfRf2YIMi
— ANI (@ANI) October 17, 2018
మరో ఘటనలో రిపబ్లిక్ టీవీ దక్షిణ భారతం బ్యూరో ఛీఫ్ పూజా ప్రసన్నపై భక్తుల ముసుగులో కొందరు దాడి చేశారు. 100 మందికి పైగా పూజా ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేశారు. అంతేకాదు పోలీసుల చేతిలో ఉన్న లాఠీలను లాక్కొని టీవీ సిబ్బందిపై దాడి చేశారు. అయితే ప్రసన్న సురక్షితంగా బయటపడ్డారు.