బీహార్ ఎన్నికలకు కరోనా ముప్పు- 5 లక్షల కోవిడ్ కిట్లు- పాట్నా మహిళల తయారీ..
ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం మొదలయ్యాక జరుగుతున్న తొలి ఎన్నికలు బీహార్ అసెంబ్లీ ఎన్నికలే. దీంతో ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం కనీవినీ ఎరుగని రీతిలో ఇందుకోసం ఏర్పాట్లు చేస్తోంది. కరోనా సోకకుండా ఇప్పటికే అభ్యర్ధులతో ఆన్లైన్ నామినేషన్లు వేయించిన ఈసీ.. ఇంటింటి ప్రచారాన్ని సైతం ఐదుగురికే పరిమితం చేసింది. కరోనాను ఎదుర్కొనేందుకు భారీగా సామాగ్రిని తయారు చేయిస్తోంది. మాస్కులు, శానిటైజర్లు, కరోనా కిట్లు.. ఇప్పుడు బీహార్లో ఎక్కడ చూసినా ఎన్నికల కంటే ఎక్కువగా వీటి హడావిడి కనిపిస్తోంది. ఈ నెల 28న జరిగే తొలిదశ ఎన్నికల కోసం పాట్నా మహిళలు 5 లక్లల కిట్లను సిద్ధం చేస్తున్నారు.
కరోనా ఉన్న వారు రైలెక్కితే కఠిన చర్యలే .. ఫైన్ తో పాటు జైలు శిక్ష కూడా !!
బీహార్ ఎన్నికలకు కరోనా భయం..
బీహార్ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా భయాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 600 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. 11 వేల యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 9 వేల మంది హోం క్వారంటైన్లోనే ఉన్నారు. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది, అభ్యర్ధులు, ఓటర్లలో భరోసా నింపడం కోసం ఈసీ ఈసారి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వీరి కోసం లక్షలాదిగా మాస్కులు, కరోనా కిట్లు, శానిటైజర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం పాట్నా, ముజఫర్పూర్, పూర్నియాలోని ప్రభుత్వ క్యాంపస్లను తీసుకుని వీటిని తయారు చేయిస్తోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుంటడంతో వీటిని సాధ్యమైనంత త్వరగా తయారు చేయాలని ఒత్తిడి పెంచుతోంది. దీంతో ఈ భారీ ప్రక్రియలో మహిళలు రాత్రింబవళ్లూ శ్రమిస్తున్నారు..
పాట్నాలో 5 లక్షల కరోనా కిట్లు తయారీ..
ఒక్క పాట్నాలోనే 5 లక్షల కరోనా కిట్లను రూపొందిస్తున్నారు. వీటి తయారీ కోసం స్ధానికంగా ప్రభుత్వ భవనాలను వాడుకుంటున్నారు. స్ధానిక మహిళల సాయంతోనే కరోనా కిట్లు తయారు చేయించాల్సిన పరిస్ధితి. అదీ అతి తక్కువ సమయంలో. దీంతో రోజుకు కొన్ని వేల కిట్లను తయారు చేసేందుకు మహిళలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పుడు వీరు పడే శ్రమ మీదే ఎంతో మంది ప్రాణాలు, జీవితాలు ఆధారపడి ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ అధికారులతో పాటు ఎన్నికల సంఘం సిబ్బంది కూడా వీరితో కలిసి ఈ భారీ ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారు.
స్వచ్చంద సంస్ధలు, ఆశావర్కర్లు...
బీహార్ ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లు, పోలింగ్ సిబ్బంది, సెక్యూరిటీ ఇలా ప్రతీ ఒక్కరి కోసం ఈ కరోనా కిట్లు తయారవుతున్నాయి. వీటిని ఎన్నికల సంఘం పోలింగ్ రోజు ఉచితంగా పంపిణీ చేయబోతోంది. వీటిని తయారు చేసే భారీ ప్రక్రియలో ఇప్పుడు రాష్ట్రంలో పలు స్వచ్ఛంద సంస్ధలతో పాటు ఆశావర్కర్లు, మధ్యాహ్న భోజన సిబ్బంది కూడా భాగస్వాములవుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ షిప్టుల ప్రకారం వీరు పనిచేస్తున్నారు. ఒక్కో చోట ఉదయం షిఫ్టులో 300 మంది మధ్యాహ్నం షిఫ్టులో 200 మంది మహిళలు కరోనా కిట్ల తయారీలో పాలుపంచుకుంటున్నారు. ఇలా పని చేస్తే రోజుకు 20 వేల నుంచి 30 వేల కిట్లు తయారవుతున్నాయి. కరోనా కిట్లు తయారు చేసినందుకు ప్రతీ మహిళకు ప్రయాణ, భోజన ఖర్చులతో పాటు 220 రూపాయల చొప్పున చెల్లిస్తున్నారు. ఇలా పాట్నా నుంచి ఐదు లక్షల కిట్ల తయారీ జరుగుతోందని అధికారులు చెబుతున్నారు.