అమ్మాయిలకి నో ఎంట్రీ, మంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్లోని ఆలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలోని లైబ్రరీలో విద్యార్ధినులకు ప్రవేశాన్ని నిషేధించారు. యూనివర్సిటీలోని మౌలానా అజాద్ లైబ్రరీలోకి తమను అనుమతించాలంటూ విద్యార్ధునులు చేసిన అభ్యర్ధనను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లెప్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జమీరుద్దీన్ షా తిరస్కరించారు.
విద్యార్ధునులను లైబ్రరీలోనికి అనుమతిస్తే... లైబ్రరీకి వచ్చే కుర్రాళ్ల సంఖ్య నాలుగు రెట్లు పెరుగుతుందని అన్నారు. వైస్ ఛాన్సలర్ అభిప్రాయాలకు మహిళా కళాశాల ప్రిన్సిపాల్ నయీమా గుల్రెజ్ మాట్లాడుతూ అమ్మాయిలను కూడా లైబ్రరీలోకి అనుమతించాలన్న డిమాండును తాము అర్థం చేసుకున్నామని, అబ్బాయిలతో నిండిపోయిన లైబ్రరీలోకి అమ్మాయిలు వెళితే, సమస్యలు వస్తాయని విద్యార్థి సంఘం నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం సందర్భంగా అన్నారు.
వైస్ ఛాన్సలర్ తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని ఐద్వా ప్రధాన కార్యదర్శి జగ్మతి సంగ్వాన్ అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న వైస్ ఛాన్సలర్పై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక జమీరుద్దీన్ షా ప్రకటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ బర్ఖా శుక్లా తీవ్రంగా మండిపడ్డారు.
మహిళల పట్ల యూనివర్సిటీ ఆలోచనా విధానాన్ని వైస్ ఛాన్సలర్ ప్రకటన నిరూపిస్తోందని విమర్శించారు. అమ్మాయిలను లైబ్రరీలోకి అనుమతిస్తే ఎక్కువ మంది అబ్బాయిలు ఆకర్షితులవుతారని చెప్పడం వాళ్ల ఆలోచన ధోరణిని తెలియజేస్తుందని అన్నారు.
అవసరమైతే ఎక్కువ మందిని అనుమతిచేందుకు లైబ్రరీని విస్తరించాలి తప్ప, మహిళల పట్ల ఇలాంటి ఆలోచన ధోరణిని ప్రదర్శించడం సరికాదన్నారు. ఇందుకు ఆయన వైస్ ఛాన్సలర్ వివరణ ఇస్తూ సమస్య క్రమశిక్షణకు సంబంధించినది కాదని, లైబ్రరీ చిన్నది కావడం వల్ల అసలు సమస్య అని చెప్పుకొచ్చారు. మామూలుగానే లైబ్రరీ కిక్కిరిసిపోతోందని అన్నారు. ఇక, అమ్మాయిలను అనుమతిస్తే అబ్బాయిల సంఖ్య నాలుగు రెట్లు పెరుగుతుందన్నారు.
లైబ్రరీలోకి అమ్మాయిలకు అనుమతి నిరాకరణపై స్పందించిన మంత్రి స్మృతి ఇరానీ
అమ్మాయిలను లైబ్రరీలోకి అనుమతిస్తే అబ్బాయిలు నాలుగు రెట్లు పెరుగుతారన్న అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ (ఏఎంయూ) వైస్ చాన్సలర్ జమీరుద్దీన్ షా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన వ్యాఖ్యలు అమ్మాయిలను కించపరిచేవిగా ఉన్నాయని అన్నారు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, విద్యతోపాటు రాజ్యాంగ హక్కులన్నీ అందరికీ సమానమేనని అన్నారు. దీనిపై కేంద్ర మానవ వనరుల శాఖ జమీరుద్దీన్ షాను వివరణ కోరింది.