అబలలు కాదు.. సబలలు..! ఎన్నికల్లో విజయభేరి మోగించిన నారీమణులు వీరే..!!
న్యూఢిల్లీ/హైదరాబాద్ : భారత నారీ లోకం మరో సారి సబలలుగా నిరూపించుకుంది. వంట గదుల్లోనే కాదు చట్ట సభల్లో కూడా సత్తా చాటుతామని నిరూపించారు. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో భారత నారీలోకం విజయభేరి మోగించింది. 542 స్థానాలకుగానూ మొత్తం 724 మంది మహిళలు బరిలో నిలిచారు. స్వతంత్ర భారత్లో ఇప్పటి వరకూ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోకెల్లా.. ఈసారి రికార్డు స్థాయిలో 78 మంది మహిళలు విజయఢంకా మోగించి.. పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు. స్వతంత్ర భారతదేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి 78 మంది ఎన్నికై రికార్డులకెక్కారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ నుంచి 11 మంది చొప్పున విజయం సాధించడం విశేషం.
ఈ ఎన్నికల్లో 41 మంది సిట్టింగ్ ఎంపీలు మళ్లీ బరిలో నిలవగా వారిలో 27 మంది విజయం సాధించారు. వీరిలో చాలామంది మహిళలు హేమాహేమీలను మట్టికరిపించడం మరో విశేషం. భోపాల్లో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ను బీజేపీ నేత సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఓడించగా, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఓడించారు. గత సభలో మహిళా ఎంపీల సంఖ్య 64గా ఉండగా.. ఈ సారి మరో 14 మంది పెరిగి మొత్తం 78కి చేరుకుంది. అంతకుముందు లోక్సభకు 52 మంది మహిళలు ఎంపికయ్యారు. కాగా, ఈ ఎన్నికల్లో అందరికంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ 54 సీట్లు మహిళలకు ఇవ్వగా.. బీజేపీ 53 సీట్లు ఇచ్చింది.