కార్పొటేర్ గా భార్య గెలిచింది, భర్తకు బిందెలతో క్షీరాభిషేకం, తాగే పాలు నేలపాలు!
మైసూరు: మైసూరు నగరంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో భార్య కార్పొరేటర్ గా విజయం సాధించడంతో ఆమె భర్తకు దేవాలయం ముందు నడిరోడ్డులో క్షీరాభిషేకం (పాలాభిషేకం) చేశారు. ప్రజలు తాగాల్సిన రెండు బిందెల పాలు నేలపాలు చేసి ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు.
మైసూరు నగరంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో యరగనహళ్ళి వార్డు నెంబర్ 36 నుంచి జేడీఎస్ పార్టీ టిక్కెట్ తో రుక్మిణి మాదేగౌడ పోటీ చేశారు. ఆ వార్డులో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రజని విజయం సాదించారు. సిట్టింగ్ కార్పొరేటర్ రజనీ మీద పోటీ చేసిన రుక్మిణి మాదే గౌడ 393 ఓట్ల మెజారిటీతో విజయం సాదించారు.
సోమవారం ఫలితాలు రావడంతో ఆ వార్డు ప్రజలకు ధన్యవాదాలు చెప్పడానికి మంగళవారం రుక్మిణి మాదేగౌడ, ఆమె భర్త మాదేగౌడ తన అనుచరులతో కలిసి వెళ్లారు. యరగనహళ్ళిలోని శ్రీ కృష్ణడి ఆలయం ముందు వెలుతున్న సమయంలో జేడీఎస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు.
మాదేగౌడ మీద రెండు బిందెల పాలు పోసి నిలువెత్తు క్షీరాభిషేకం చేశారు. పాలు ప్రజలు తాగాలని, ఇలాంటి పనులు చెయ్యకూడదని మాదేగౌడ కార్యకర్తలకు చెప్పడానికి ప్రయత్నించలేదని ఆరోపణలు వచ్చాయి. మాదేగౌడ శ్రీరాంపుర జిల్లా పంచాయితీ సభ్యుడు. భార్య, భర్త ఇద్దరూ పదవుల్లో ఉండటంతో వారి అనుచరులు హంగామా మొదలైయ్యింది.