'ఉమెన్స్ డే': రెచ్చిపోయిన శివసేన కార్యకర్తలు.. జంటల్ని తరిమి తరిమికొట్టారు..
బీచు వెంబడి యువతి యువకులను పరిగెత్తిస్తూ దాదాపుగా వారిని కొట్టినంత పనిచేశారు. బీచులో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న వారిపై నానా దుర్భాషలాడారు.
కొచ్చి: సాధారణంగా ప్రేమికుల దినోత్సవం నాడు పార్కుల్లో, బీచుల్లో హడావుడి చేసి యువతీ యువకుల పట్ల తీవ్రంగా వ్యవహరించే పలు సంస్థలు 'ఉమెన్స్ డే' నాడు కూడా తమ దౌర్జన్యాన్ని కొనసాగిస్తున్నాయి. తాజాగా కేరళలోని కొచ్చి బీచులో పలు జంటలపై శివసేన కార్యకర్తలు రెచ్చిపోయారు.
బీచు వెంబడి యువతి యువకులను పరిగెత్తిస్తూ దాదాపుగా వారిని కొట్టినంత పనిచేశారు. బీచులో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న వారిపై నానా దుర్భాషలాడారు. పాశ్చాత్య సంస్కృతి మోజులో స్వదేశీ సంస్కృతిని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. చేతుల్లో లాఠీలు, కర్రలు, పార్టీ జెండాలతో బీచులో వారు వ్యవహరించిన తీరు రౌడీలను తలపించిందని చెబుతున్నారు.
దాదాపు 20మంది శివసేన కార్యకర్తలు గుంపుగా తరలివచ్చి బీచులో ఈ ఆగడానికి పాల్పడ్డారు. మహిళా సంరక్షణ పేరిట శివసేన ఇలాంటి ఆగడాలకు దిగడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విషయంపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లడంతో ఘటనకు కారణమైనవారిని అరెస్టు చేస్తామని తెలిపారు.