ఏడాది వయస్సున్న కుమారుడిని వదిలేసి..ఉరి వేసుకుని!
బెంగళూరు: సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరులోని జేపీ నగరలో నివసించే సుప్రియ ఆదివారం రాత్రి తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
హుబ్బళ్లికి చెందిన సుప్రియ కొంతకాలంగా బెంగళూరులో నివసిస్తున్నారు. ఎలక్ట్రానిక్ సిటీలో ఓ సాఫ్ట్వేర్ సంస్థలో మానవ వనరుల విభాగంలో పనిచేస్తున్నారు. నాలుగేళ్ల కిందట ఆమె అక్షయ్ అనే యువకుడిని పెళ్లి చేసుకున్నారు. సుప్రియ, అక్షయ్లది ప్రేమ వివాహం. వివాహం అనంతరం వారు జేపీ నగరలోని 14వ క్రాస్లో నివసించసాగారు. వారికి ఏడాది వయస్సు ఉన్న కుమారుడు ఉన్నాడు. కొద్దిరోజుల కిందటే వారు తమ కుమారుడి మొదటి పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు.
ఇటీవలి కాలంలో సుప్రియపై అక్షయ్కు అనుమానాలు ఏర్పడ్డాయని తెలుస్తోంది. ఈ అనుమానాలతోనే అతను తరచూ ఆమెను వేధింపులకు గురి చేస్తుండేవాడని సుప్రియ కుటుంబీకులు చెబుతున్నారు. శని, ఆదివారాల్లో అక్షయ్ తీవ్ర స్థాయిలో సుప్రియతో ఘర్షణ పడ్డాడని తెలుస్తోంది. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన సుప్రియ ఆదివారం మధ్యాహ్నం తన గదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరి వేసుకున్నారు. రాత్రి అయినప్పటికీ.. తలుపులు తెరవకలేదు. దీనితో వారు తలుపులను పగులగొట్టి చూడగా.. సుప్రియ నిర్జీవంగా ఫ్యానుకు వేలాడుతూ కనిపించారు. వెంటనే వారు జేపీ నగర పోలీసులకు సమాచారం ఇచ్చారు.