వ్యభిచారం కేసులో మహిళలు కూడా శిక్షించబడాలా..? కీలక తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు
ఢిల్లీ: బుధవారం వరుస తీర్పులతో బిజీగా గడిపిన సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ఈ రోజు కూడా మరో కీలక తీర్పులు ఇవ్వనున్నారు. తన పదవీకాలం ముగిసేలోగా జస్టిస్ మిశ్రా పలు సంచలన అంశాలపై తీర్పును వెల్లడించనున్నారు. గురువారం కూడా ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం నాటి బ్రిటీష్ కాలం చట్టంపై కీలక తీర్పు ఇవ్వనుంది. వివాహ వ్యవస్థలో భార్య భర్తల మధ్య ఏదైనా వివాదం నెలకొంటే కేవలం మగవారిని మాత్రమే ఇప్పటి వరకు దోషిగా చేస్తున్నారని ఆ చట్టాన్ని పునఃపరిశీలించాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ వర్తించదు
సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను ఆగష్టులో విచారణ చేసిన అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే అంతకుముందు ఇచ్చిన తీర్పులో ఐపీసీ సెక్షన్ 497ను ప్రస్తావిస్తూ కేవలం ఒక వ్యక్తి ఒకే వివాహం చేసుకోవాలని చెప్పడం లేదని అయితే వివాహ వ్యవస్థపై విశ్వసనీయత కలిగి ఉండాలని తీర్పు చెప్పింది. అయితే సుప్రీంలో దాఖలైన పిటిషన్లన్నీ చట్టంలో ఉన్న ఈ ప్రొవిజన్లను కొట్టివేయాలని కోరాయి. వివాహం తర్వాత మగవారు వ్యభిచారం చేస్తే అందుకు మగవారిని మాత్రమే బాధ్యులుగా చేస్తున్నారని... మహిళలను మాత్రం వదిలేస్తున్నారని ఇలాంటి వ్యవస్థ వద్దని చెబుతూ రద్దు చేయాలని పిటిషనర్లు పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో పిటిషన్ విన్న సుప్రీంకోర్టు మహిళలను శిక్షించేలా కొత్త సవరణ అయితే చట్టంలో చేర్చలేమని స్పష్టం చేసింది.
స్వాతంత్ర్యం కంటే ముందునుంచి ఉన్న వ్యభిచార చట్టంపై వాదనలు విన్న ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా... సమాజంలో వ్యభిచారం అనేది పౌరులు చేసే తప్పు అని అది నేరంగా పరిగణించలేమని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఆయన వ్యభిచారం, విడాకులకు మరో పద్ధతిని సూచించారు. అంతేకాదు వ్యభిచారం చేస్తూ పట్టుబడిన మగవారికి ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించడంపై ప్రధాన న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే కేంద్రం తరపున ఐపీసీ సెక్షన్ 497 పై వాదించిన అడిషనల్ సాలిసిటర్ జనరల్ పింకి ఆనంద్... సమాజానికి ఈ చట్టం మేలు చేస్తుందని కేంద్రం భావిస్తోందని కాబట్టి సెక్షన్ 497ను కొనసాగిస్తూనే వివాహ వ్యవస్థపై ఉన్న పవిత్రతను పరిరక్షిస్తామని కేంద్రం స్టాండ్ను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే వివాహంలో గొడవలు వచ్చి భార్యాభర్తలు విడిపోతే అది సమాజానికి ఎలా మేలు చేస్తుందని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది.
సెక్షన్ 497 కింద మహిళ భర్త తన ప్రియుడిని విచారణ చేసే అధికారం ఉంది. అదే సమయంలో భర్త మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నా..లేదా వ్యభిచారానికి పాల్పడినా మహిళకు ఆ స్త్రీని ప్రశ్నించే హక్కు సెక్షన్ 497 కల్పించలేదు.అంతేకాదు వ్యభిచారంలో తన భర్తను కూడా ప్రశ్నించే హక్కుకానీ అధికారం కానీ సెక్షన్ 497 ఇవ్వలేదు.