మోడీని అనుమతించలేది లేదు: తేల్చేసిన పాక్ మంత్రి, భారీ జరిమానాకు సిద్ధమేనా?
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: తమ దేశ గగన తలంపై నుంచి అమెరికాకు వెళ్లేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీకి అనుమతిచ్చేది లేదని పాకిస్థాన్ మంత్రి షా మెహమూద్ ఖురేషీ తేల్చి చెప్పారు. జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే పాకిస్థాన్ తమ గగనతలంలోకి భారత విమానాలను నిషేధించింది. నెల రోజుల క్రితం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మూడు దేశాల పర్యటన సందర్భంగా కూడా పాక్ అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం. తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు కూడా పాక్ అనుతిమించలేదు.
మోడీ అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో పాకిస్థాన్ గగనతలం గుండా వెళ్లేందుకు అనుమతించాలని భారత్ ఆ దేశాన్ని కోరిన విషయం తెలిసిందే. ఒక వేళ ప్రధాని విమానాన్ని పాకిస్థాన్ తన గగన తలంలోకి అనుమతించకపోతే.. అంతర్జాతీయ పౌర విమానాయన సంస్థ(ఐసీఏఓ) నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుందని భారత అధికారులు స్పష్టం చేశారు. ఈ నిబంధనలకు కట్టుబడి ఉంటామని గతంలో పాక్ దీనిపై సంతకం చేసిందని గుర్తు చేశారు.
'ట్రంప్! భారత్కు జీఎస్పీ హోదా ఇవ్వండి లేదంటే అమెరికాకే భారీ నష్టం'
ఐసీఏఓ నిబంధనల ప్రకారం.. యుద్ధం లేదా ఎమర్జెన్సీ వంటి సమయాల్లోనే గగనతలంలోకి విమానాన్ని అనుమతించడంపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ ఉల్లంఘనను భారత్ ఐసీఏఓకు ఫిర్యాదు చేస్తే మాత్రం భారీ జరిమానా చెల్లించక తప్పదు.