పెరియార్పై వ్యాఖ్యలు: ‘సారీ’ చెప్పనంటూ రజినీకాంత్, ‘ఫర్ ఏ ఛేంజ్’అంటూ సుబ్రమణ్యస్వామి సపోర్ట్
చెన్నై: సామాజికవేత్త ఈవీ రామస్వామి పెరియార్పై ప్రముఖ సినీనటుడు, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే, పెరియార్ గురించి చేసిన వ్యాఖ్యలకు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పేది లేదని స్పష్టం చేశారు రజినీకాంత్.
సారీ చెప్పనంటూ రజినీకాంత్..
మంగళవారం రజినీకాంత్ ఇంటి ముందు పెరియార్ ద్రవిడర్ కళగమ్ నలుపు రంగు దుస్తులు ధరించి నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలోనే రజినీకాంత్ ఇంటి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. పెరియార్ వివాదంపై స్పందిస్తూ తాను ఎట్టి పరిస్థితిల్లోనూ క్షమాపణలు చెప్పనని రజినీకాంత్ తేల్చి చెప్పారు.
నేను చెప్పింది నిజం.. కట్టుబడి ఉన్నా..
‘1971లో ఏం జరిగిందో నేను చెప్పిన దానిపై చర్చ జరుగుతోంది. అప్పుడు ఏం జరిగిందో మ్యాగజైన్లో వచ్చిన కథనాలను బట్టే నేను చెప్పాను. కానీ, సొంతంగా ఊహజనిత విషయాలేమీ నేను చెప్పలేదు. వాటికి సంబంధించిన క్లిప్పింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఆ ఘటన గురించి నేను ఏం చూశానో అదే చెప్పాను. అందుకే దీనికి క్షమాపణ చెప్పను' అని రజినీకాంత్ స్పష్టం చేశారు.
అభ్యంతకరంగా సీతారాముల విగ్రహాల ఊరేగింపు..
కాగా, చెన్నైలో జనవరి 14న తుగ్లక్ పత్రిక 50వ వార్షికోత్సవంలో పాల్గొన్న రజినీకాంత్.. పెరియార్ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. 1971లో పెరియార్ నిర్వహించిన ర్యాలీలో సీతారాముల విగ్రహాలను అభ్యంతరకరంగా ఊరేగించారని చెప్పారు. దీంతో పెరియార్ గురించి రజినీ తప్పుడు ఆరోపణలు చేశారంటూ ద్రవిడర్ విడుదలై కళగమ్ అధ్యక్షుడు మణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేగాక, రజినీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రజినీకాంత్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రజినీ తాజాగా స్పందిస్తూ.. తనపై ఎవరెన్ని కేసులు పెట్టినా.. క్షమాపణ చెప్పను అని స్పష్టం చేశారు. తాను మీడియాలో వచ్చేందే చెప్పానని అన్నారు.
బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి నుంచి ఊహించని మద్దతు
ఇది ఇలావుంటే, ఎప్పుడూ రజినీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసే బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి మాత్రం ఈ విషయంలో ‘ఫర్ ఏ ఛేంజ్’ అంటూ మద్దతు తెలిపారు. రజినీకాంత్ పెరియార్ విషయంలో చెప్పిన మాటలన్నీ నిజమేనని వ్యాఖ్యానించారు. రజినీకాంత్ తాను చేసిన మాటలపై నిలబడితే.. ఆయన తరపున న్యాయస్థానంతో తాను వాదిస్తానని సుబ్రమణ్యస్వామి స్పష్టం చేశారు.
రజినీకి ఖుష్బూ సపోర్ట్..
కాగా, రజినీకాంత్ తాను చేసిన వ్యాఖ్యలపై నిలబడటాన్ని ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ పార్టీ నేత ఖుష్భూసుందర్ ప్రశంసించారు. రజినీకాంత్ నిజాయితీని అందరూ సమర్థించాల్సిందేనని అన్నారు. భయం పాలించలేదని అన్నారు. మనసు చెప్పిన మాటలను చెప్పాల్సిందేనేనని అన్నారు. ప్రతి ఒక్కరూ మాట్లాడాలని అన్నారు. రజినీకి మద్దతుగా వ్యాఖ్యలు చేసినందుకు ఆమెను కొందరు విమర్శించగా.. వాటిని సమర్థంగా తిప్పికొట్టారు.