మైనారిటీలో గెహ్లట్ సర్కార్..?, సీఎల్పీ మీటింగ్కు డుమ్మా, తనతో 30 మంది ఎమ్మెల్యేలు: సచిన్ పైలట్
మరికాసేపట్లో రాజస్తాన్ సీఎల్పీ సమావేశం కాబోతోంది. డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తన వర్గంతో తిరుగుబావుటా ఎగరేసి హస్తినలో మకాం వేశారు. అయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ చీఫ్ రాహుల్ గాంధీని మాత్రం కలవబోనని స్పష్టంచేశారు. ఉదయం 10.30 గంటలకు రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లట్ నివాసంలో జరిగే కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్కు కూడా హాజరుకాబోనని సచిన్ పైలట్ స్పష్టంచేశారు. దీంతో రాజస్తాన్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమేనని అనిపిస్తోంది.
పతనం అంచున కాంగ్రెస్ సర్కార్: 30 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో సచిన్ పైలట్: జేపీ నడ్డాతో
30 మంది ఎమ్మెల్యేలు..
తనతో 30 మంది వరకు ఎమ్మెల్యేలు ఉన్నారని, ఇండిపెండెంట్లు కూడా కొందరు ఉన్నారని సచిన్ పైలట్ చెబుతున్నారు. రాజస్తాన్లో అశోక్ గెహ్లట్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని ఓ హిందీ వార్తా సంస్థతో సచిన్ తెలిపారు. అయితే ఆదివారం రాత్రి కొందరు ఎమ్మెల్యేలు స్పీకర్కు తమ రాజీనామా లేఖలు అందజేస్తారని ప్రచారం జరిగింది. కానీ దీనిపై ఇప్పటివరకు స్పష్టత లేదు.
10.30 గంటలకు సీఎల్పీ
సోమవారం 10.30 గంటలకు జరిగే సీఎల్పీ సమావేశం నిర్వహిస్తోంది. సమావేశానికి హాజరయ్యే ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా రాజస్తాన్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ ఆధారపడి ఉంటోంది. మరోవైపు మధ్యప్రదేశ్ మాదిరిగా కాకుండా చూస్తామని కాంగ్రెస్ పెద్దలు అంటున్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఢిల్లీ నుంచి అజయ్ మాకెన్, రణదీప్ సుర్జేవాలా రాజస్తాన్ వెళ్లారు. ఎమ్మెల్యేలతో రాజస్తాన్ పీసీసీ చీఫ్ అవినాష్ పాండే కూడా చర్చలు జరుపుతున్నారు.
Recommended Video
109 మంది ఎమ్మెల్యేలు...
హై కమాండ్పై ధిక్కార స్వరం వినిపిస్తోన్న సచిన్ పైలట్.. 30 మందితో కలిసి ఢిల్లీలో మకాం వేసినా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ధీమాతో ఉంది. తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు అని పైకి మాత్రం గంభీర్యంగా చెబుతోంది. తమతో ఇప్పటికీ 109 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ప్రకటిస్తోంది. కానీ సచిన్ మాత్రం కాషాయ పార్టీతో మంతనాలు కొనసాగుతోన్నాయి. ఆయన ఇవాళ బీజేపీలో చేరతారనే జోరుగా ప్రచారం జరుగుతోంది.