ఐశ్వర్యతో విడాకులు, అప్పటి దాకా ఇంటికి వచ్చేది లేదు: తేజ్ ప్రతాప్, ఒత్తిడితో నిద్రలేని లాలూ
ఢిల్లీ: పెళ్లైన ఆరు నెలల్లోనే తన భార్య ఐశ్వర్యకు విడాకులు ఇచ్చిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్.. విడాకుల అంశంలో తన కుటుంబం తన మాటను అంగీకరించే వరకు తాను ఇంటికి వచ్చేది లేదని తేల్చి చెప్పారు.
ఐశ్వర్యతో కలిసి జీవించలేను, పెళ్లి వద్దని ఇంట్లో చెబితే వినలేదు: విడాకులపై తేజ్ ప్రతాప్
ఈ రోజు (శుక్రవారం) అతని సోదరుడు తేజస్వి యాదవ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే అదే సమయంలో తాను ఢిల్లీలో జరుగుతున్న పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేది లేదని చెప్పారు.
ఇంటి ముఖం చూడను
తన భార్యతో విడాకులు తీసుకోవాలన్న తన నిర్ణయానికి తన కుటుంబ సభ్యులు మద్దతు పలికే వరకు ఇంటి ముఖం చూడనని తేజ్ ప్రతాప్ యాదవ్ తేల్చి చెప్పారు. ఓ స్థానిక న్యూస్ చానల్తో అతను ఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ మేరకు తన నిర్ణయాన్ని తెలిపారు. ఇదే సందర్భంగా తన సోదరుడు, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజశ్వికి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. తన సోదరుడి జన్మదిన వేడుకలకు కూడా తాను హాజరు కావడం లేదన్నారు.
విభేదాలకు వారూ కారణం
తనకు, తన భార్యకు మధ్య నెలకొన్న విభేదాలు తొలగిపోవని తేజ్ ప్రతాప్ తేల్చి చెప్పారు. తమ పెళ్లికి ముందే తాను ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పానని అన్నారు. అప్పుడు, ఇప్పుడు ఎవరూ తన మాట వినడం లేదన్నారు. తన మాటను వారు వినకపోతే తాను ఇంటికి ఎందుకు వెళ్తానని ప్రశ్నించారు. తమ మధ్య విభేదాలు తలెత్తడానికి తమ దగ్గర బంధువులు కూడా కారణమన్నారు.
నా సోదరుడు సీఎం కావాలి, అండగా ఉండా
తన సోదరుడు తేజస్వి యాదవ్ బీహార్ ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటున్నానని తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు. మహాభారతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉన్నట్టు, తన తమ్ముడికి తాను ఉంటానని చెప్పారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి డరోగ ప్రసాద్ రాయ్ మనవరాలు ఐశ్వర్య రాయ్తో మే 12న తేజ్ ప్రతాప్ వివాహం జరిగింది. ఆరు నెలలు గడవక ముందే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అతను విడాకులకు దరఖాస్తు పెట్టుకున్నారు.
లాలూ సరిగ్గా నిద్రపోవడం లేదు
మరోవైపు, కుటుంబ సమస్యల కారణంగా లాలూ ప్రసాద్ యాదవ్ సరిగా నిద్రపోవడం లేదట. దాణా స్కాంలో ఆయన జైలు జీవితం గడుపుతున్నారు. అనారోగ్య కారణాలతో జార్ఖండ్లోని రిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్ మాట్లాడారు. కుటుంబ సమస్యలతో లాలూ సరిగా నిద్రపోవడం లేదన్నారు. ప్రతిరోజు 14 నుంచి 15 రకాల మందులను ఆయన తీసుకుంటున్నారని, 70 ఏళ్లు ఉన్న ఆయనకు టెన్షన్, ఒత్తిడి మంచిది కాదన్నారు.
కుటుంబ సమస్యలు వేధిస్తున్నాయి
సరిగా నిద్రపోకపోవడం ఆయన ఆరోగ్యాన్ని మరింత క్షీణింపజేస్తుందని డాక్టర్ తెలిపారు. మధుమేహం, కిడ్నీ సమస్యల వంటి రుగ్మతలతో ఆయన బాధపడుతున్నారన్నారు. మధుమేహానికి సంబంధించి ఆయనకు ప్రతిరోజూ ఎక్కువ డోసులో ఇన్సులిన్ ఇస్తున్నామన్నారు. రాత్రిపూట చాలాసేపు నిద్రపోకుండా ఉంటున్నారని, కుటుంబ సమస్యలతో ఆయన సతమతమవుతున్నారన్నారు. షుగర్ లెవెల్స్ పెరిగిపోవడంతో లాలూకు గత మూడు రోజులుగా ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ ఇస్తున్నామన్నారు. కాగా, విడాకుల విషయమై తన కొడుకుతో మాట్లాడేందుకు లాలూ కూడా ప్రయత్నించారని తెలుస్తోంది.