మీరు చెప్పినంత మాత్రాన.. మేం అమలు చేయాలా? అమిత్ షానకు బీజేపీ సీఎం చురకలు
బెంగళూరు: భారతీయ జనతాపార్టీ సుప్రిమో, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిర్ణయానికి బీజేపీ పాలిత రాష్ట్రం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. అమిత్ షా ఆదేశించినంత మాత్రానా దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఎంత మాత్రమూ లేదని తేల్చి చెప్పింది బీజేపీ ప్రభుత్వం. ఏది చెబితే అది అమలు చేయడం కుదరదని కుండ బద్దలు కొట్టింది. హిందీని మాతృభాషగా అన్ని రాష్ట్రాలు ప్రకటించాలని, ఒకే దేశం, ఒకే భాష అనే గాంధీజీ, వల్లభ్ భాయ్ పటేల్ కలలను సాకారం చేయాలంటూ కొద్దిరోజుల కిందటే అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దిశగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు త్వరలోనే తమ నిర్ణయాన్ని సైతం తెలియజేయాలని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. దీనిపై దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.
దక్షిణాదిలో ఏకైన బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటక కూడా దీనికి మినహాయింపే కాదు. హిందీని అమలు చేయడం సాధ్యమే కాదని బీజేపీ సీనియర్ నాయకుడు, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తేల్చి చెప్పారు. తమ రాష్ట్రంలో హిందీని అధికారిక భాషగా అమలు చేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే రాష్ట్రంలో కన్నడ భాషను మరింత ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటామని, అధికారిక కార్యక్రమాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. కన్నడిగులపై బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం ఏ మాత్రం చేయబోమని ఆయన అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ట్వీట్ చేశారు. కన్నడ భాషను కాదని హిందీని అమలు చేయబోమని స్పష్టం చేశారు. ఈ విషయం రాజీపడబోమని అన్నారు.
హిందీని అమలు చేయాలన్న అమిత్ షా ప్రకటనపై ఇప్పటికే కాంగ్రెస్, సహా సీపీఎం పాలిత రాష్ట్రమైన కేరళ సైతం నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. అదే జాబితాలో సాక్షాత్తూ బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రే చేరడం ఆసక్తి రేపుతోంది. కేరళ, పశ్చిమ బెంగాల్, తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రులు పినరయి విజయన్, మమతా బెనర్జీ, బీఎస్ యడియూరప్ప హిందీ అమలుపై తమ విధానాన్ని, నిర్ణయాన్ని స్పష్టం చేశారు. అమిత్ షా చేసిన ప్రకటనపై తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోన్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష డీఎంకే పార్టీ అమిత్ షా నిర్ణయాన్ని తప్పు పడుతోంది. మక్కళ్ నీథి మయ్యం చీఫ్ కమల్ హాసన్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ విషయంలో ఏకతాటిపై నిలిచాయి.
All official languages in our country are equal. However, as far as Karnataka is concerned, #Kannada is the principal language. We will never compromise its importance and are committed to promote Kannada and our state's culture.
— CM of Karnataka (@CMofKarnataka) September 16, 2019