న్యాయం జరిగేంతవరకూ చితాభస్మాన్ని నిమజ్జనం చేసేది లేదు... తేల్చి చెప్పిన హత్రాస్ బాధితురాలి తండ్రి
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనను సుమోటో కేసుగా తీసుకున్న అలహాబాద్ హైకోర్టు అక్కడి పోలీసులు,అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాత్రికి రాత్రే కుటుంబ సభ్యులను సైతం అనుమతించకుండా బాధితురాలి అంత్యక్రియలు నిర్వహించడాన్ని తప్పు పట్టింది. మీ ఇంట్లో ఓ ఆడ కూతురు చనిపోతే ఇలాగే వ్యవహరిస్తారా అని మండిపడింది. కోర్టు ప్రశ్నలకు అడిషనల్ డైరెక్టర్ జనరల్(లా&ఆర్డర్) ప్రశాంత్ కుమార్ వద్ద సమాధానం లేకుండా పోయింది.
యూపీలో జర్నలిస్ట్ సహా నలుగురి అరెస్ట్... హత్రాస్ బాధిత కుటుంబాన్ని కలిసేందుకు వెళ్తుండగా...
ప్రాథమిక హక్కులకు భంగం...
సోమవారం(అక్టోబర్ 12) కోర్టు విచారణ అనంతరం హత్రాస్ బాధిత కుటుంబం తరుపు న్యాయవాది సీమ కుష్వాహా మీడియాతో మాట్లాడారు. 'మీకూ ఒక కూతురు ఉండి ఉంటే... ఆమెను ఆఖరి చూపైనా చూడకుండానే అంత్యక్రియలకు అనుమతించి ఉండేవారా..? అని కోర్టు ఏడీజీ ప్రశాంత్ కుమార్ను ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు ఆయన వద్ద సమాధానం లేకుండా పోయింది. మౌనంగా నిలబడిపోయారు...' అని కుష్వాహా తెలిపారు. కుల,మత,ప్రాంత,వర్గాలకు అతీతంగా అందరికీ సమానంగా అందాల్సిన ప్రాథమిక హక్కులను బాధిత కుటుంబానికి దక్కకుండా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంప్రదాయం ప్రకారం... అంత్యక్రియలకు ముందు మృతదేహంపై గంగా నది నీళ్లు చల్లడం ఆనవాయితీ అని... కానీ పోలీసులు బాధితురాలి మృతదేహంపై కిరోసిన్ చల్లి ఆమె ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారని ఆరోపించారు.
బాధితురాలి తండ్రి ఏమంటున్నారు...
సోమవారం బాధిత కుటుంబం వాంగ్మూలాన్ని నమోదు చేసిన అలహాబాద్ హైకోర్టు తదుపరి విచారణను నవంబర్ 2కి వాయిదా వేసింది. కోర్టు నుంచి ఇంటికి తిరిగొచ్చాక బాధితురాలి తండ్రి మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో న్యాయం జరిగేంతవరకూ బాధితురాలి చితాభస్మాన్ని నిమజ్జనం చేసేది లేదని తేల్చి చెప్పారు. 'కోర్టుకు మా బాధను చెప్పుకున్నాం. అక్కడ ఇంగ్లీషులో జరిగిన వాదనలు మాకేమీ అర్థం కాలేదు. అయితే అంత్యక్రియల విషయంలో అధికారుల తీరును కోర్టు తప్పి పట్టినట్లు అర్థమైంది. ఇప్పుడు మేము న్యాయం కావాలంటున్నాం. అంతవరకూ మా కూతురి చితాభస్మాన్ని నిమజ్జనం చేసేది లేదు..' అని చెప్పారు.
బాధితురాలి సోదరుడు ఏమన్నారు...
బాధితురాలి సోదరుడు మాట్లాడుతూ... 'మా సోదరి అంత్యక్రియలకు సంబంధించి కోర్టు పోలీసులు,అధికారులను కొన్ని ప్రశ్నలు అడిగింది. అంత్యక్రియలు మా ఇష్టపూర్వకంగానే జరిగాయా లేదా అని మమ్మల్ని అడిగింది. దాదాపు గంట సేపు వాదనలు జరిగాయి. అంతా ఇంగ్లీషులోనే జరిగింది.... మొత్తానికి డిస్ట్రిక్ మెజిస్ట్రేట్పై కోర్టు అసహనం వ్యక్తం చేసింది..' అని చెప్పుకొచ్చారు. విచారణకు హాజరైన హత్రాస్ బాధిత కుటుంబం కోసం లక్నోలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు వెల్లడించారు. వారికి కావాల్సిన ఫుడ్తో పాటు వాహనం,సెక్యూరిటీని కల్పించామన్నారు.
Recommended Video
జిల్లా మెజిస్ట్రేట్ సమాధానం...
రాత్రికి రాత్రే ఎందుకు అంత్యక్రియలు నిర్వహించారన్న ప్రశ్నకు హత్రాస్ జిల్లా మెజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు,హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకే అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చిందని కోర్టుకు తెలిపారు. పీఎఫ్ఐ లాంటి సంస్థలు,కొంతమంది జర్నలిస్టులు బాధిత కుటుంబాన్ని రెచ్చగొట్టేలా ఇందులో జోక్యం చేసుకునే అవకాశం ఉన్నట్లు తమ వద్ద బలమైన ఆధారాలున్నాయన్నారు. అందుకే ఆ రాత్రే అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పారు.