సిద్ధూ కీలక ప్రకటన-మెలిక: సింగపూర్కు 'కింగ్' మేకర్ కుమారస్వామి..రహస్య మంతనాలు?
Recommended Video
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మరో ట్విస్ట్. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం ఆసక్తికర ప్రకటన చేశారు. పార్టీ అధిష్టానం దళితుడికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా తాను అంగీకరిస్తానని వెల్లడించారు. సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారని అంటున్నారు.
చదవండి: ఇవే నా చివరి ఎన్నికలు: సిద్ధూ, బీజేపీకి 130 సీట్లు ఖాయం.. సీఎం 100 శాతం ఓడిపోతారు: యెడ్డీ
ఏ పార్టీకి మెజార్టీ సీట్లు రావని, హంగ్ వస్తుందని ఎక్కువ ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో జేడీఎస్ కింగ్ లేదా కింగ్ మేకర్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ చర్చ జరుగుతుండగా సిద్ధూ హఠాత్తుగా 'దళిత ముఖ్యమంత్రి' వ్యాఖ్యలు చేశారు. తాము బీజేపీతో కలిసేది లేదని ఇప్పటికే జేడీఎస్ అధినేత దేవేగౌడ చెప్పారు.
అక్కడే మెలిక
దళిత ముఖ్యమంత్రి అంశంపై సిద్ధరామయ్య మరో ట్విస్ట్ కూడా ఇచ్చారు. తమ పార్టీ అధిష్టానం దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తే తమకు అభ్యంతరం లేదని చెబుతూ.. గెలిచిన ఎమ్మెల్యేల మాట వినాలని, వారి అభీష్టం ప్రకారం ముందుకెళ్లాలని మెలిక పెట్టారు. జేడీఎస్ మద్దతు కోసమే సిద్ధరామయ్య దళిత సీఎం ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నారు. జేడీఎస్ -మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఎగ్జిట్ పోల్స్ హంగ్ వస్తుందని చెప్పిన తర్వాత సిద్ధూకు దళిత సీఎం గుర్తుకు వచ్చిందని, ఆయన అధికారంలో ఉన్నంతకాలం ఎందుకు గుర్తుకు రాలేదని అంటున్నారు. మొత్తానికి జేడీఎస్ మద్దతు కోసం ఆ ప్రకటన చేశారని అంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కూడా కర్నాటకకు దళిత సీఎం కావాలన్నారు. ఇన్నాళ్లు గుర్తుకు రానిది ఇప్పుడు గుర్తుకు వచ్చారనేదే అందరి ప్రశ్నగా ఉంది. ఇక్కడ మరో విషయాన్ని కూడా చర్చించుకుంటున్నారు. హంగ్ వస్తే జేడీఎస్ మద్దతు కోసం దళిత సీఎం పదవిని తెరపైకి తెచ్చారని, ఒకవేళ మెజార్టీ వస్తే అనే ఉద్దేశ్యంతోనే.. అందరు ఎమ్మెల్యేలు అంగీకరించే వారు కావాలని మెలిక పెట్టారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
జేడీఎస్కు డిమాండ్, కింగ్ లేదా కింగ్ మేకర్
అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో కర్నాటకలో నేతలు విశ్రాంతి తీసుకుంటున్నారు. మరోవైపు హంగ్ వస్తుందని తేలడంతో ముఖ్య నేతలు మంతనాల్లో మునిగిపోయారు. జేడీఎస్ కింగ్ లేదా కింగ్ మేకర్గా అవతరించే అవకాశముంది. ఇదే సమయంలో జేడీఎస్ అధినేత కుమార స్వామి సింగపూర్ వెళ్లారు. ఆయన సింగపూర్ పర్యటన వెనుక కారణం మంతనాలు అనే చర్చ సాగుతోంది.
సింగపూర్లో రెండు వర్గాలతో చర్చలు
ఇప్పటికే రెండు వర్గాలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. కానీ కుమారస్వామి మాత్రం కచ్చితమైన డిమాండ్లతో ఉన్నారట. తమ డిమాండ్లకు ఎవరు మద్దతిస్తే వారితో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మైసూరులోని తన ఇంట్లో కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. బీజేపీ నేత యెడ్యూరప్ప శివమొగ్గలో ఓటు వేసిన అనంతరం తిరిగి బెంగళూరు చేరుకున్నారు.
స్వతంత్రులు లేదా జేడీఎస్ కింగ్ మేకర్
కాగా, కర్నాటకలో స్పష్టమైన మెజార్టీతో బీజేపీ గెలుస్తుందని ఓ ఎగ్జిట్ పోల్ సర్వే, కాంగ్రెస్ గెలుస్తుందని మరో ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించాయి. అయితే ఎక్కువ వరకు హంగ్ వస్తుందని చెప్పాయి. మెజార్టీకి కావాల్సిన 113 సీట్లకు ఐదారు సీట్లు తక్కువ పడితే స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారనున్నారు. ఎక్కువ సీట్లు అవసరం పడితే మాత్రం జేడీఎస్ కింగ్ లేదా కింగ్ మేకర్ అయ్యే అవకాశముంది.
వరుణుడి కరుణ
ఇదిలా ఉండగా, కర్నాటక ఓటింగులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓటేయడానికి వెళ్లే ముందు బీజేపీ అభ్యర్థి శ్రీరాములు గోపూజ చేశారు. చాముండేశ్వరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న జేడీ(ఎస్) అభ్యర్థి సతీమణి ఓటు వేసేందుకు పోలింగ్ బూత్కు వచ్చారు. అయితే ఈవీఎం సరైన ప్రదేశంలో పెట్టలేదని, వాస్తు బాగలేదని దాన్ని మరో చోటకు మార్చాలని అధికారులను బలవంతపెట్టారు. చేసేదేమీ లేక వేరే చోటికి మార్చారు. అంతకుముందు రెండు రోజులు పెద్ద ఎత్తున వర్షం కురిసింది. దీంతో ఎన్నికల రోజు అందరూ భయపడ్డారు. కానీ వరుణుడు కరుణించాడు.
ప్రత్యేక యాప్లు
కర్నాటకలో మొదటిసారి మహిళలకోసం ప్రత్యేకించి సఖి పేరుతో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు 600లకు పైగా ఏర్పాటు చేశారు. ఇవన్నీ గులాబీ రంగులోనే ఉన్నాయి. అందుకే వీటికి పింక్ బూత్లని పేరు పెట్టారు. ఓటర్ల సౌకర్యార్థం ఎస్సెమ్మెస్ బేస్ట్ పోలింగ్ స్టేషన్ యాక్సెస్ను అందుబాటులోకి తెచ్చింది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో నిలబడి ఉన్న ఓటర్ల స్టేటస్ను చూసుకోవడానికి, నావిగేషన్ తదితర సదుపాయాల కోసం ఓ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఓటు వేయగానే రసీదు వచ్చే వీవీపాట్లను దక్షిణాదిలోనే తొలిసారి కర్నాటకలో ఉపయోగించారు. సీఎంలుగా పని చేసిన లేదా చేస్తున్న నలుగురు అభ్యర్థులు పోటీ చేశారు. ముండేశ్వరి, బాదామిల నుంచి సిద్ధరామయ్య(కాంగ్రెస్), శిఖరిపుర నుంచి యడ్యూరప్ప(బీజేపీ), చెన్నపట్న, రామనగర నుంచి హెచ్డీ కుమారస్వామి(జేడీఎస్), హుబ్లీ-దర్వాడ్ సెంట్రల్ నుంచి జగదీష్ షెట్టర్(బీజేపీ).