సుప్రీం వ్యాఖ్యలు: రిజైన్కు మొండికేస్తున్న శ్రీనివాసన్
న్యూఢిల్లీ: బిసిసిఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి ఎన్ శ్రీనివాసన్ మొండికేస్తున్నారు. తాను రాజీనామా చేయబోనని, గురువారం సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చే వరకు వేచి చూస్తానని ఆయన అన్నట్లు టీవీ చానెళ్లలో వార్తలు వస్తున్నాయి. బిసిసిఐ అధ్యక్ష పదవిలో కొనసాగడంపై సుప్రీంకోర్టు మంగళవారంనాడు తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
తాను ఏ తప్పూ చేయలేదని, బిసిసి నుంచి తప్పకోవాలని ఎవరూ తనపై ఒత్తిడి తేలేరని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు గురువారం తన ఆదేశాలను వెలువరించే వరకు వేచి చూస్తామని బిసిసిఐ ఉపాధ్యక్షుడు శివలాల్ యాదవ్ కూడా అన్నారు. భవిష్యత్తు కార్యాచరణ కోసం ఉన్న న్యాయపరమైన మార్గాలను చూస్తున్నామని ఆయన అన్నారు.
ఐపియల్ బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణాలపై సరైన విచారణ జరిగేందుకు శ్రీనివాసన్ పదవి నుంచి తప్పుకోవడం అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తాము ప్రజల ప్రతిష్టను దెబ్బ తీయదలుచుకోలేదని, అయితే, బిసిసిఐ అధ్యక్షుడు తప్పుకుంటే తప్ప దర్యాప్తు నిజాయితీగా జరగబోదని సుప్రీంకోర్టు దిస్వభ్య బెంచ్లోని న్యాయమూర్తి ఎకె పట్నాయక్ అన్నారు.
ముకుల్ ముద్గల్ సమర్పించిన నివేదికను ప్రస్తావిస్తూ జస్టిస్ పట్నాయక్ ఆ మాటలు అన్నారు. శ్రీనివాసన్ మేనల్లుడు గురునాథ్ మేయప్పన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపియల్ జట్టు డీఫ్యాక్టో యజమానిగా వ్యవహరిస్తున్నారని నివేదిక అభిప్రాయపడింది.