సీపీఎంను విమర్శించను.. బీజేపీయే టార్గెట్ : రాహుల్ గాంధీ
వయనాడ్ : దక్షిణాదివారికి అండగా ఉండేందుకు వయనాడ్ నుంచి బరిలో దిగుతున్నానన్న కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఆ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం చెల్లెలు ప్రియాంకతో కలిసి ర్యాలీ నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల ప్రచారంలో తాను కేరళలో అధికార సీపీఎంను పల్లెతు మాట అననని రాహుల్ స్పష్టం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కి అడ్డుకట్ట వేసేందుకే తాను అమేథీతో పాటు వయనాడ్ నుంచి బరిలో దిగుతున్నానని స్పష్టంచేశారు.
చెల్లెలు ప్రియాంక తో కలిసి వయానాడ్ లో నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధి
కాంగ్రెస్, సీపీఎంల మధ్య ఉన్న వైరం భవిష్యత్తులో కొనసాగుతుందని రాహుల్ తేల్చి చెప్పారు. తనపై లెఫ్ట్ పార్టీలు చేసే ఆరోపణలన్నింటికీ సమాధానం చెబుతానని, అయితే ఆ పార్టీపై మాత్రం ఒక్క విమర్శ కూడా చేయనని అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలు కలిసి ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల సంస్కృతిని, చరిత్రను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాయని రాహుల్ విమర్శించారు. వారి ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకే అమేథీతో పాటు వయనాడ్ నుంచి పోటీకి దిగుతున్నానని అన్నారు.
ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ నిర్ణయంపై లెఫ్ట్ పార్టీలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రెసిడెంట్ను వయనాడ్ నుంచి బరిలో దింపాలన్న కాంగ్రెస్ నిర్ణయం బీజేపీకి లబ్ది చేకూరుస్తుందని అంటున్నాయి.