సైనికులే నిజమైన పౌరులు.. తృణప్రాయంగా ప్రాణత్యాగమన్న మోడీ
న్యూఢిల్లీ : దేశ భవిష్యత్ ను కాపాడే నిజమైన పౌరులే సైనికులన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దేశం కోసం ప్రాణ త్యాగం చేయడం అమరత్వమని కీర్తించారు. కార్గిల్ విజయ్ సందర్భంగా కాసేపటి క్రితం ఢిల్లీలోని ఇందిరాగాంధీ మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జాతినుద్దేశించి ప్రసంగించారు. కార్గాల్ అమరవీరులకు శిరస్సువంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. కార్గిల్ విజయం భారత సామర్థ్యానికి, సైనికుల కర్తవ్యానికీ ప్రతీకగా అభివర్ణించారు.
కార్గిల్ విజయం తర్వాత సైనికులు మంచుకొండల్లో త్రివర్ణ పతాకం ఎగురవేశారని మోడీ గుర్తుచేశారు. కార్గిల్ లో పోరాడిన సైనికులు నిజమైన యుద్ధవీరులని పేర్కొన్నారు. దేశం కోసం పోరాడే సైనికుల వెన్నంటే ప్రజలంతా ఉన్నారని స్పష్టంచేశారు. అమరవీరులు నేలకొరిగిన స్థలాలు పుణ్యక్షేత్రాల కన్నా పవిత్రమైనవని పోల్చారు. దేశం కోసం తృణప్రాయంగా ప్రాణత్యాగం చేసిన సైనికులను దేశం సర్వదా స్మరించుకుంటుందని తెలిపారు. సైనికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వ చర్యలు తీసుకున్నట్టు ఈ సందర్భంగా వివరించారు.
ఆక్రమణల గురించి భారత్ ఎప్పుడూ ప్రయత్నించలేదు, ఆలోచించలేదని ఈ సందర్భంగా మోడీ తెలిపారు. కానీ ఇంచు భూమిని కూడా శత్రువులకు ఇచ్చేందుకు సిద్ధం కాదన్నారు. అందుకోసమే కార్గిల్ లో రొమ్ము చూపి పోరాడినట్టు పేర్కొన్నారు. భారత్ శాంతి కోసమే ప్రయత్నిస్తోంది. కానీ శత్రువు దానిని బలహీనంగా తీసుకోవద్దన్నారు.