శరద్ పవార్ యూటర్న్.. ఈడీకి ముఖం చాటేస్తూ పొలిటికల్ ట్విస్ట్
మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకులో మనీ ల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వస్తానని ప్రకటించడంతో హైటెన్షన్ నెలకొంది. దర్యాప్తు సంస్థలను గౌరవించాలని కార్యకర్తలు రావొద్దని శరద్ పవార్ సూచించారు. ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు. దీంతో బాలార్డ్ ఎస్టేట్లో ఉన్న ఈడీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు బలగాలను మొహరించారు.
ఈడీ కార్యాలయానికి శరద్ పవార్ వస్తానని ప్రకటించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో తాను ఈడీ కార్యాలయానికి రావడం లేదని పవార్ ప్రకటించారు. సంబంధిత కేసుకు సంబంధించి ఈడీ రావాలని కోరితే మాత్రం తప్పకుండా హాజరవుతానని పేర్కొన్నారు. శరద్ పవార్ ఈడీ కార్యాలయానికి వస్తారనే ఊహాగానాలు రావడంతో అక్కడికి భారీగా ఎన్సీపీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో శాంతిభద్రతల సమస్య తలెత్తుందని పోలీసులు భావించారు.
ముంబై పోలీసు కమిషనర్ స్వయంగా కల్పించుకొని.. ఈడీ కార్యాలయానికి రావొద్దని శరద్ పవార్ను కోరారు. ఆ తర్వాత పార్టీ నేతలతో పవార్ సమావేశమయ్యారు. పరిస్థితి గురించి సమీక్షించారు. ముంబై సీపీ సూచనమేరకు ఈడీ కార్యాలయానికి రావొద్దని నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు ఈడీ కార్యాలయం శరద్ పవార్కు మెయిల్ కూడా చేసింది. మనీ ల్యాండరింగ్ కేసులో విచారణకు రావొద్దని అందులో కోరింది. మొత్తానికి పవార్ రావడం లేదని తెలిసి పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.