నా కుటుంబంతో కలిసి ఉంటానా?: దేవయాని ఆవేదన
న్యూఢిల్లీ: తన ఇద్దరు చిన్న పిల్లలను, భర్తను న్యూయార్క్లోనే వదిలి పెట్టి రావడంలో తాను ఎంత తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి వచ్చిందో వివరించిన దౌత్యాధికారిణి దేవయాని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని తీరుతానని చెప్పారు. తన ఇంట్లో పని మనిషికి సంబంధించిన వీసా దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణపై దేవయానిని అరెస్టు చేసి తనిఖీ చేయడంపై గత నెలరోజులకు పైగా భారత్, అమెరికాల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ ఆరోపణలకు సంబంధించి కోర్టులో అభియోగాలు నమోదు చేసిన కొన్ని గంటల తర్వాత దేవయానికి పూర్తి దౌత్య రక్షణను మంజూరు చేసి దేశం వదిలి పెట్టి భారత్ తిరిగి వెళ్లడానికి అమెరికా అధికారులు అనుమతించారు. అయితే ఆమె మళ్లీ అమెరికా వస్తే అరెస్టు చేస్తామని, ఆమె కోర్టులో కేసు విచారణను ఎదుర్కోవలసి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఏడేళ్లు, నాలుగేళ్ల వయసున్న తన ఇద్దరు పిల్లలను, అమెరికా పౌరుడైన తన భర్తను న్యూయార్క్లోనే వదిలిపెట్టి తిరిగి రావడానికి తాను ఎంతో ఆవేదన చెందానని 39 ఏళ్ల దేవయాని ఒక జాతీయ దినపత్రికకు వివరించారు.
తాను మళ్లీ తన ఇద్దరు చిన్నారులను, తన భర్తను కలుసుకుంటానా లేదా అనేది అనుమానమేనని, వాళ్లకు దూరంగా ఉండడం బాధగా ఉందని దేవయాని సండే ఎక్స్ప్రెస్ పత్రికకు చెప్పారు. తన పిల్లలు అమెరికాలోనే చదువుకుని అక్కడే పని చేయాలని నిర్ణయించుకుంటే ఏం చేయాలని, తాను మళ్లీ అమెరికా తిరిగి వెళ్లకపోతే పరిస్థితి ఏమిటంటే తాము ఒకే కుటుంబంగా కలిసి జీవించడానికి వీలులేదనే దానర్థమన్నారు.
కాగా, దేవయాని పట్ల అమెరికా అధికారుల ప్రవర్తనకు ప్రతీకార చర్యగా భారత ప్రభుత్వం తాజాగా న్యూఢల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలోని ఒక దౌత్య అధికారిని దేశం వదిలిపెట్టి వెళ్లవలసిందిగా ఆదేశించింది. బహిష్కరణకు గురయిన అధికారి దేవయానితో సమానమైన ర్యాంక్ అధికారి కావడమే కాక, ఆమె పని మనిషి కుటుంబ సభ్యులు అమెరికా వెళ్లడానికి సహకరించినట్లు అనుమానిస్తున్నారు.