ఆ వీడియో అద్భుతం: ప్రధాని మోడీకి థ్యాంక్స్ అంటూ ఇవాంక ట్రంప్
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంకా ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోడీ ట్విట్టర్లో యోగ నిద్ర వీడియోను షేర్ చేయగా.. దాన్ని వీక్షించారు ఇవాంక ట్రంప్. ఆ తర్వాత ఆ వీడియో అద్భుతమంటూ రీట్వీట్ చేశారు.
వీడియో అద్భుతం.. మోడీజీ థ్యాంక్స్
ఆ తర్వాత ఆ వీడియో అద్భుతమంటూ రీట్వీట్ చేశారు. అంతేగాక, ఈ వీడియోను అందించినందుకు ఆమె ప్రధాని నరేంద్ర మోడీకి థ్యాంక్స్ చెప్పారు. తనకు తీరిక దొరికినప్పుడల్లా.. వారానికి ఒకటి రెండుసార్లు యోగ నిద్ర ప్రాక్టీస్ చేస్తానని మోడీ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉండటం కోసం, మనస్సుకు ఒత్తిడి నుంచి ప్రశాంతత లభించేందుకు యోగ నిద్ర ఉపకరిస్తుందని చెప్పారు.
వీడియోలు పంచుకుంటానంటూ..
లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండటం కోసం ప్రధాని మోడీ ఈ వీడియో ట్వీట్ చేశారు. గత ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ ఓ ప్రశ్నకు స్పందిస్తూ.. లాక్ డౌన్ సమయంలో ఫిట్గా ఉండేందుకు పలు వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటానని తెలిపారు.
ఇదే యోగ నిద్ర వీడియో..
అయితే, తాను ఫిట్నెస్ నిపుడిని కాదు.. యోగా టీచర్ను కూడా కాదని.. తాను సాధన చేసేవాడిని మాత్రమేనని ప్రధాని మోడీ తెలిపారు. కొన్ని యోగాసనాలు తనకు అద్భుతంగా పనికొచ్చాయని, లాక్ డౌన్ సమయంలో ఇందులో కొన్ని టిప్స్ మీకు కూడా ఉపకరించొచ్చన్నారు. కరోనావైరస్ కారణంగా మనదేశంలో 1200 మందికిపైగా కరోనావైరస్ బారినపడగా.. 32 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోనూ కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. సుమారు లక్ష మంది వరకు కరోనాబారిన పడ్డారు. 5వేల మందికిపైగా మరణించారు.
దేశంలో రెండుసార్లు పర్యటించిన ఇవాంక..
కాగా, ఇవాంక ట్రంప్ మనదేశంలో రెండుసార్లు పర్యటించిన విషయం తెలిసిందే. తొలిసారి 2017లో హైదరాబాద్ నగరంలో జరిగిన గ్లోబల్ ఎంటర్ప్రిన్యూర్ సమ్మిట్లో పాల్గొనడం కోసం వచ్చారు. ఆ తర్వాత ఈ యేడాది డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి, ఇవాంక ట్రంప్, ఆమె భర్త కుటుంబసమేతంగా మనదేశంలో పర్యటించిన విషయం తెలిసిందే. తాజ్ మహల్ ను సందర్శించి ఫొటోలు కూడా దిగారు. తమ భారత పర్యటనను మర్చిపోలేమని, తాజ్ మహల్ అద్భుతమంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.