"ఏ నొప్పికైనా సరే ఔషధం పనిచేయడమే" : నవీన్ పట్నాయక్ పీఎస్ వీకే పాండియన్
భువనేశ్వర్: ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ రోజు తన 74వ పుట్టిన రోజును నిరాడంబరంగా జరుపుకుంటున్నారు. నవీన్ పట్నాయక్ను ప్రజలు దీవిస్తున్నారంటే ఆయన పాలన అంత భేషుగ్గా ఉందని చెప్పక తప్పదు. దాదాపుగా 20 ఏళ్లుగా ఒడిషా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ దేశంలోనే అత్యంత ఎక్కువ కాలంగా పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు నవీన్ పట్నాయక్. ఇక నవీన్ పట్నాయక్ గురించి అతనితో అనుబంధం గురించి కొందరు పంచుకున్నారు. అందులో ముఖ్యులు నవీన్ పట్నాయక్ వ్యక్తిగత సహాయకులు(పీఎస్) వీకే పాండియన్ (ఐఏఎస్).
నవీన్ పట్నాయక్ దగ్గర నుంచి తాను ఎంతో నేర్చుకున్నట్లు వీకే పాండియన్ చెప్పారు. ఈ క్రమంలోనే తానొక ఘటనను గుర్తు చేశారు. సాధారణంగా పంటి నొప్పి వచ్చిందంటే ప్రాణాలు పోయినంత పనవుతుంది. అంతలా మనిషిని పంటినొప్పి వేధిస్తుంది. కొన్నేళ్ల క్రితం ఓ ఉదయాన 9 గంటల ప్రాంతంలో తనకు నవీన్ పట్నాయక్ ఇంటి నుంచి ఫోన్ వచ్చిందన్నారు వీకే పాండియన్. సీఎం పంటినొప్పితో బాధపడుతున్నాడంటూ ఫోన్ చేసిన వ్యక్తి తనతో చెప్పినట్లు వెల్లడించాడు పాండియన్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కోసం సీఎం హాస్పిటల్కు వెళుతున్నారని అవతల వ్యక్తి చెప్పగా 10:30 గంటలకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోతుందని చెప్పారు.
ఇక 11:30 గంటలకు రివ్యూ మీటింగ్ ఉండగా నవీన్ పట్నాయక్ రూట్ కెనాల్ చికిత్స తర్వాత నేరుగా కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్లడం చూసి షాక్కు గురైనట్లు గుర్తుకు చేసుకున్నారు వీకే పాండియన్. ఇక ఆరోజు ముందున్న షెడ్యూల్ను మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు పాండియన్ చెప్పారు. పంటి నొప్పికి చికిత్స తీసుకున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తప్పకుండా విశ్రాంతి తీసుకుంటారన్న ఉద్దేశంతో ఆ రోజు కార్యక్రమాలు అప్పాయింట్మెంట్లు వాయిదా వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు. తనకు కూడా తను చదువుకునే రోజుల్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తీసుకుని కాలేజీని రెండు రోజుల పాటు ఎగరగొట్టిన విషయాన్ని పాండియన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. నాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుని సంబరపడుతుండగానే ఒక మెసేజ్ వచ్చిందని పాండియన్ చెప్పాడు.
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పూర్తి చేసుకుని నేరుగా సెక్రటేరియట్కు బయలుదేరారంటూ మెసేజ్ వచ్చిందని పాండియన్ చెప్పాడు. నేరుగా హాస్పిటల్ నుంచి సెక్రటేరియట్కు వచ్చి పనుల్లో నిమగ్నమైన సీఎం నవీన్ను చూసి ఆశ్చర్యపోయానని పాండియన్ చెప్పాడు. అనుకున్న సమయం ప్రకారమే 11:30 గంటలకు మీటింగ్లో పాల్గొందామంటూ నవీన్ పట్నాయక్ చెప్పినట్లు పాండియన్ వెల్లడించాడు. అప్పటికే వాయిదా వేసిన కార్యక్రమాలన్నీ యథావిధిగా కొనసాగుతాయని సందేశం పంపిన విషయాన్ని పాండియన్ చెప్పాడు.
Recommended Video
సర్ ఈ రోజుకు విశ్రాంతి తీసుకుంటే సరిపోయేది కదా.. అని నవీన్ పట్నాయక్ను పాండియన్ అడుగగా.. అందుకు నవీన్ పట్నాయక్ సమాధానం ఇలా ఇచ్చాడు."నొప్పిని భరించగలిగే శక్తి నాకుంది. సమయం ఎందుకు వృథా చేయడం. ఈ నొప్పికంటే ఇంకా నొప్పి కలిగించే అంశాలను చాలామంది ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో వారు మన సహాయం కోసం ఎదురుచూస్తున్నారు" అని నవీన్ పట్నాయక్ చెప్పినట్లు పాండియన్ వెల్లడించారు. నొప్పికి పని చేయడమే నిజమైన మందు పాండియన్ అని చెప్పి నవీన్ పట్నాయక్ నవ్వినట్లు ఈ అధికారి వెల్లడించారు. సీఎం నవీన్ పట్నాయక్ పనిపట్ల ఎంత నిబద్దత కలిగి ఉంటారో అని చెప్పేందుకే ఈ చిన్న కథ చెప్పినట్లు పాండియన్ చెప్పారు.