ముద్రణ సిబ్బంది షాక్: రోజుకు 60లక్షల నోట్ల ప్రింటింగ్ ఆగింది!
సల్బోనీలోని కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ సిబ్బంది అదనపు సమయం పనిచేసేందుకు విముఖత చూపిస్తున్నారు. దీంతో రోజుకు 60లక్షల నోట్ల ముద్రణ ఆగిపోయింది.
కోల్కతా: పెద్ద నోట్ల రద్దు తర్వాత మళ్లీ సాధారణ స్థితికి వచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను 50 రోజులు గడువు అడిగిన విషయం తెలిసిందే. కాగా, బుధవారానికే ఆయన కోరిన గడువు పూర్తయింది. సామాన్యులకు చిల్లర కష్టాలు కొంతమేర తగ్గినట్లు కనిపిస్తున్నా..పూర్తిస్థాయిలో అయితే ఉపశమనం కలగలేదు.
ఇది ఇలా ఉండగా, పశ్చిమబెంగాల్లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా సల్బోనీలోని కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ సిబ్బంది అదనపు సమయం పనిచేసేందుకు విముఖత చూపిస్తున్నారు. దీంతో రోజుకు 60లక్షల నోట్ల ముద్రణ ఆగిపోయింది. దీంతో నోట్ల కష్టాల కాలం మరికొంత పొడిగించినట్లయింది.
ముద్రణా సిబ్బంది సాధారణంగా రోజుకు 9 గంటలు పని చేస్తారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం 15 రోజుల నుంచి రోజుకు 12 గంటలపాటు పని చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఉద్యోగులు తమకు నడుము నొప్పి, నిద్రపట్టకపోవడం, శారీరక, మానసిక ఒత్తిడి బాధిస్తున్నాయని ఫిర్యాదులు చేస్తున్నారు.
రోజుకు 12గంటల షిఫ్ట్లో వీరు రోజుకు రూ. 4.6 కోట్ల నోట్లను ముద్రించేవారు. బుధవారం నుంచి మూడు షిఫ్ట్లలో కేవలం 4 కోట్ల నోట్లను మాత్రమే ముద్రిస్తున్నారు. అంటే రోజుకు 60 లక్షల నోట్లు తగ్గుతాయన్నమాట.
భారతీయ రిజర్వు బ్యాంకు నోట్ ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్(బీఆర్బీఎన్ఎంపీఎల్) ఉద్యోగుల సంఘం నేత ఒకరు మాట్లాడుతూ.. తాము యాజమాన్యంతో డిసెంబర్ 14న ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. రోజుకు 12 గంటల షిఫ్ట్లలో పనిచేయడానికి కుదిరిన ఈ ఒప్పందం డిసెంబర్ 27తో ముగిసిందన్నారు. దీనిని పొడిగించేందుకు తాము నిరాకరించామని తెలిపారు.
కాగా, ఈ ప్రింటింగ్ ప్రెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్కు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సిసిర్ అధికారి అధ్యక్షుడిగా ఉండటం గమనార్హం. వర్కర్స్ ఓవర్ టైమ్ చేయలేరని ఆయన తేల్చి చెప్పారు. కార్మికులు తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు. దేశం కోసమే ఇన్ని రోజులు అదనంగా పనిగంటలు చేశారని, ఇక వారు చేయరని స్పష్టం చేశారు.