రాలేకపోయా.. కానీ, వస్తా: భారత ప్రజలకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రిపబ్లిక్ డే గ్రీటింగ్స్
లండన్/న్యూఢిల్లీ: భారత ప్రజలకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం జరుపుకుంటున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరుకాలేకపోయినందుకు ఆయన విచారం వ్యక్తం చేశారు. అయితే, త్వరలోనే భారత్కు వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
భారత గణతంత్ర వేడుకలకు నా మిత్రుడు ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు హాజరవ్వాలని ఆసక్తిగా వేచిచూశాను. కానీ, కరోనాపై మనమంతా చేస్తున్న పోరాటం కారణంగా వేడులకు దూరంగా ఉండాల్సి వచ్చింది అని బోరిస్ జాన్సన్ తెలిపారు. కరోనా మహమ్మారి ముప్పు తొలగించేందుకు చేస్తున్న వ్యాక్సిన్ల తయారీలో ఇరుదేశాలు పరస్పర సహకారంతో ముందుకు వెళుతున్నాయన్నారు. త్వరలోనే కరోనాపై విజయం సాధించబోతున్నామని చెప్పారు.
"I look forward to visiting India later this year, strengthening our friendship, and striving for the quantum leap in our relationship that Prime Minister @narendramodi and I have both pledged to achieve".
— UK in India🇬🇧🇮🇳 (@UKinIndia) January 26, 2021
- British Prime Minister @BorisJohnson's #RepublicDay message for India pic.twitter.com/HzN6SGcZu2
ప్రధాని మోడీతో గతంలో కుదిరిన ఒప్పందం మేరకు ఉభయదేశాల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు త్వరలోనే తాను భారత్లో పర్యటిస్తానని బోరిస్ జాన్సన్ తెలిపారు. కరోనా కారణంగా ప్రజలంతా దూరంగా ఉండాల్సి వస్తోందని చెప్పారు. బ్రిటన్, భారత్కు మధ్య వారధిగా ఉన్న అనేక మంది ప్రవాస భారతీయులు కూడా ఒకరికొకరు కలుసుకోలేకపోతున్నారని చెప్పారు.
భారత గణతంత్ర వేడుకలకు బ్రిటన్ ప్రధానిని ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే, బ్రిటన్లో కరోనా కొత్త రకం కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి కారణంగా ఆయన తన భారత్ పర్యటను రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం బ్రిటన్ కరోనా స్ట్రెయిన్ వైరస్ కూడా ప్రపంచ వ్యాప్తంగా భారత్ తోపాటు పలు దేశాలకు వ్యాపించింది. దీంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి.