మోడీ మ్యాజిక్ : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మెరుగైన భారత ర్యాంక్
ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న భారత్కు ఇది గుడ్న్యూస్ అవుతుంది. ఆర్థిక వృద్ధి రేటు పడిపోతోందంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారత్ 14 స్థానాలు పైకి ఎగబాకి 63వ స్థానంలో నిలిచింది. గురువారం రోజున వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులను విడుదల చేసింది.
63వ స్థానంలో భారత్
ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో భారత్ 63వ స్థానం పొందింది. అంతేకాదు ఈ కేటగిరీలో టాప్ టెన్ పర్ఫార్మింగ్ దేశాల్లో భారత్ వరసగా మూడోసారి స్థానం పొందింది. కేంద్రప్రభుత్వం మానసపుత్రిక ప్రాజెక్టుగా ఉన్న మేకిన్ ఇండియా స్కీమ్ ద్వారా విదేశీ పెట్టుబడులు ఎక్కువగా ఆకర్షించగలిగిందని నివేదిక పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్తో పాటు ఇతర రేటింగ్ ఏజెన్సీలు భారత ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నంగా తయారవుతోందని విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఈ ర్యాంకు కాస్త ఊరటనిచ్చింది.
2018లో 100వ స్థానంలో నిలిచిన భారత్
2014లో ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 190 దేశాల్లో భారత్ ర్యాంకు 142గా ఉన్నింది. నాలుగేళ్లలో మోడీ సర్కార్ తీసుకొచ్చిన సంస్కరణలతో 2018 రిపోర్టు ప్రకారం ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారత్ 100వ ర్యాంకుకు చేరుకుంది. 2017లో భారత్ ర్యాంకు 130గా ఉన్నింది. ఆ సమయంలో ఇరాన్ ఉగాండా దేశాలకు కింద భారత్ స్థానం ఉండేది. ట్యాక్స్ విధానం, ఇతర అంశాల్లో ప్రభుత్వం సంస్కరణలు తీసుకురావడంతో గతేడాది భారత్ 23 స్థానాలు ఎగబాకి 77వ స్థానం పొందింది. డూయింగ్ బిజినెస్ 2020 నివేదిక ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో భారత్ ఈ స్థానం పొందిందని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది.
టాప్ టెన్ పర్ఫార్మింగ్ దేశాల్లో భారత్కు స్థానం
ఈజ్ఆఫ్ డూయింగ్ కేటగిరీలో టాప్ టెన్ పర్ఫార్మింగ్ దేశాల్లో వరుసగా మూడో సారి స్థానం పొందడం భారత్కే చెందిందని , ఇలా చాలా తక్కువ దేశాలు ఉన్నాయని వరల్డ్ బ్యాంకులో డెవలప్మెంట్ ఎకనామిక్స్ డైరెక్టర్ సీమెన్ జకోవ్ చెప్పారు. ఇక భారత్ విషయం పక్కనబెడితే టాప్ టెన్ పర్ఫార్మింగ్ దేశాల్లో సౌదీ అరేబియా, జోర్డాన్, టోగో, బెహ్రెయిన్, తజకిస్తాన్, పాకిస్తాన్, కువైల్, చైనా, నైజీరియా దేశాలు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
మేకిన్ ఇండియా-సంస్కరణలతోనే సాధ్యం
ప్రధాని నరేంద్ర మోడీ మేకిన్ ఇండియా కార్యక్రమంపై దృష్టి సారించి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారని దీంతో ప్రైవేట్ రంగంలో, ఉత్పత్తి రంగంలో పెట్టుబడుల వెల్లువ కనిపించిందని వరల్డ్ బ్యాంక్ తన నివేదికలో పేర్కొంది. భారత్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే గట్టి పట్టుదలతో పెట్టుబడుల కోసం అన్ని అనుమతులు ఇచ్చేందుకు మోడీ సర్కార్ ముందుకు వచ్చిందని నివేదిక వెల్లడించింది. 2020 నాటికల్లా భారత్ ఘనమైన ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు ఉన్న టాప్ 50 దేశాల సరసన నిలవాలని లక్ష్యంగా పనిచేసిందని నివేదిక గుర్తు చేసింది. ఇక టాప్ 25లో స్థానం సంపాదించాలంటే మోడీ సర్కార్ మరిన్ని సంస్కరణలతో ముందుకు రావాలని కోరారు సీమెన్ జకోవ్.
పలు అంశాల్లో సంస్కరణలు తీసుకొచ్చిన మోడీ సర్కార్
మోడీ సర్కార్ పాలనా పరంగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు కావాల్సిన అంశాలపై దృష్టి సారించిందని చెప్పారు. పన్ను విధానం, సరిహద్దు వాణిజ్యం, దివాలా వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించి వాటిలో సంస్కరణలు తీసుకొచ్చిందని నివేదిక వెల్లడించింది. 2016లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 130వ స్థానంలో ఉన్న భారత్ పై అంశాలపై దృష్టి సారించడంతో 63వ స్థానానికి ఎగబాకిందని వెల్లడించింది. ఇక రుణాలు తీసుకుని ఎగవేసిన డీఫాల్టర్ల సంస్థలకు మోడీ సర్కార్ చరమగీతం పాడిందని నివేదిక పేర్కొంది.