లోకల్ ట్రైన్లో ప్రయాణించిన వరల్డ్ బ్యాంక్ ఎండీ
ముంబై: వరల్డ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ముల్యాని ఇంద్రావతి భారత్లో తన మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను కలిశారు. అంతేకాదు ముంబైల్ లోకల్ ట్రైన్లో ప్రయాణించారు.
మూడు రోజుల పర్యటన కోసం ఆమె భారత్కు వచ్చారు. మంగళవారం ఆమె ముంబై సబర్బన్ లోకల్ ట్రైన్లోని సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్లో మహిళలతో కలిసి ప్రయాణించారు. సబర్బన్ రైలు వ్యవస్ధ ఎలా పనిచేస్తుంది, ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందా లేదా అనే విషయం తెలుసుకోవడానికే ఆమె అందులో ప్రయాణించారు.
ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘరామ్ రాజన్తో కూడా ఆమె భేటీ అయ్యారు. జైపూర్లో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేను కూడా ఆమె కలవనున్నారు.
భారత్, వరల్డ్ బ్యాంక్ మధ్య సత్సబంధాలను పెంపొందించడానికే ఆమె భారత్ పర్యటనకు వస్తున్నట్లు వరల్డ్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆమెతో పాటు వరల్డ్ బ్యాంక్ దక్షిణా ఆసియా వైస్ ప్రెసిడెంట్ అన్నెట్టి డిక్సన్ కూడా భారత్ పర్యటనకు వచ్చారు.
అభివృద్ధిలో మహిళా కార్మికులు పాల్గొనడం అనే అంశంపై జైపూర్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రసంగించనున్నారు. జులై 2014 నుంచి జూన్ 2015 మధ్య కాలానికి భారత అభివృద్ధికి వరల్డ్ బ్యాంక్ $3.8 బిలియన్ సహాయం చేసింది.