స్కూల్స్ మూసివేతతో ఇండియాలో 400బిలియన్ డాలర్లకు పైగా నష్టం .. ప్రపంచ బ్యాంకు సర్వేలో షాకింగ్ అంశాలు
కరోనా కారణంగా విద్యా వ్యవస్థ పీకల్లోతు కష్టాలలోకి , నష్టాలలోకి మునిగిపోయింది. ఈ ఏడాది మార్చి 16వ తేదీ నుండి పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడ్డాయి.భారతదేశంలో కరోనా కారణంగా స్కూల్స్ ను దీర్ఘకాలం మూసివేయడం వల్ల భారతదేశ భవిష్యత్తు ఆదాయంలో 400 బిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లుతుందని,విద్యార్థులు చదువులో వెనుకబడటమే కాకుండా ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 400 బిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లుతుందని తెలుస్తోంది. దక్షిణాసియా దేశాల్లో ఎక్కువ నష్టం ఇండియాకే జరిగిందని సర్వేలో వెల్లడైంది.
Recommended Video
విద్యార్థులపై కోవిడ్ ఫీజుల బాదుడు .. శానిటైజేషన్ కోసం బెంగుళూరు స్కూల్స్ నిర్ణయం
స్కూల్స్ , కాలేజీల మూసివేతతో నష్టం అంచనా వేసిన ప్రపంచ బ్యాంకు
కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి 16వ తేదీ నుంచి స్కూల్స్ లాక్ డౌన్ కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకు స్కూల్స్ తెరుచుకోలేదు. జూన్ 15వ తేదీ నుండి దేశంలో అన్లాక్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కరోనా వ్యాప్తి నేపధ్యంలో స్కూల్స్ , కాలేజీలను ఇంకా తెరవలేదు. రాబోయే రోజుల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పటికే స్కూల్స్, కాలేజీలు మూసివేత కారణంగా ఎంత నష్టం జరిగిందన్న విషయంపై ప్రపంచబ్యాంకు సర్వే నిర్వహించగా భారతదేశం 400 బిలియన్ డాలర్లకు పైగా నష్టపోయినట్లుగా అంచనా వేసింది.
దక్షిణాసియా దేశాలకు 622 బిలియన్ డాలర్ల నుండి 800 బిలియన్ డాలర్ల మేర నష్టం
ముఖ్యంగా దక్షిణ ఆసియా దేశాలు 622 బిలియన్ డాలర్ల నుండి 800 బిలియన్ డాలర్ల మేర నష్టాన్ని చవిచూసినట్లుగా ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది .ఇప్పటికే విద్యార్థులు సగం విద్యాసంవత్సరం కోల్పోయినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పాఠశాలల మూసివేత ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు డిజిటల్ విద్యా విధానం ద్వారా పిల్లలను నిమగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయని కానీ అవి సత్ఫలితాలను ఇవ్వడం లేదని కూడా సర్వే చెప్పింది.
దేశీయ స్కూల్స్ తో పాటు ఇంటర్నేషనల్ స్కూల్స్ కు గణనీయంగా పడిపోయిన ఆదాయం
భారతదేశంలో దేశంలో స్వయంగా నిర్వహించబడుతున్న స్కూల్స్ తో పాటు, ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా పెట్టుబడులు పెట్టాయి. ఇప్పుడు అవన్నీ తీవ్ర నష్టాలలో ఉన్నాయి . ఇప్పటి వరకు స్కూల్స్ నిర్వహణకు అనుకూలంగా పరిస్థితులు లేకపోవటంతో అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న పలు స్కూల్స్ కూడా మూత పడ్డాయి . ఈ పరిణామాలు భవిష్యత్ విద్యారంగ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు . ఇప్పటికే విద్యార్థుల విద్యా ప్రమాణాలు విపరీతంగా తగ్గిపోగా చాలా మంది చదువుకు గుడ్ బై చెప్తుండటం తీవ్ర పరిణామం .
5.5 మిలియన్ల మంది విద్యార్థులు చదువు మానేసే పరిస్థితి... భవిష్యత్లోనూ తీవ్ర ప్రభావం
విద్యార్థులు లెర్నింగ్ స్కిల్స్ ను కోల్పోతున్నారని సర్వే స్పష్టం చేసింది. 5.5 మిలియన్ల మంది విద్యార్థులు చదువు మానేసే పరిస్థితి కూడా వచ్చిందని సర్వే పేర్కొంది. ఇంత కాలం స్కూల్స్ ను మూసి వేయడం వల్ల విద్యార్థులు కొత్తగా నేర్చుకునే విద్యా నైపుణ్యాలను నేర్చుకోకపోగా, గతంలో నేర్చుకున్న వాటిని కూడా మర్చిపోయే ప్రమాదం ఉందని సర్వే పేర్కొంది. మొత్తంగా చూస్తే కరోనా కారణంగా భారత దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రమే సంక్షోభంలో పడలేదని, విద్యా వ్యవస్థ, విద్యా వ్యవస్థలో 400బిలియన్ డాలర్లకు పైగా నష్టం జరగటంతో పాటు చిన్నారుల భవిష్యత్తు కూడా సంక్షోభంలో పడిందని అర్థమౌతుంది.