World Cancer Day:తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న బ్రెస్ట్ , సర్వికల్ క్యాన్సర్
హైదరాబాదు: ప్రతి ఏటా ఫిబ్రవరి 4వ తేదీన వరల్డ్ క్యాన్సర్ డేను జరుపుకుంటాం. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఏదో ఒక క్యాన్సర్ బారిన పడి మృతి చెందుతున్నారు. క్యాన్సర్ ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా వస్తోంది. బ్రెస్ట్ మరియు సర్వికల్ క్యాన్సర్తో మహిళలు ఎక్కువగా మృతి చెందుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న బ్రెస్ట్ సర్వికల్ క్యాన్సర్
మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే గత ఐదేళ్లలో క్యాన్సర్ బారిన పడ్డ మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2016 నుంచి 2018 వరకు తెలంగాణలో బ్రెస్ట్ క్యాన్సర్ 13 శాతం అధికంగా పెరిగింది. ఇక సర్వికల్ క్యాన్సర్ చూసినట్లయితే ఇదే సమయానికి తెలంగాణలో 2శాతం పెరుగుదల రికార్డ్ అయ్యింది. ఇక ఆంధ్రప్రదేశ్లో బ్రెస్ట్ క్యాన్సర్ 12 శాతం పెరుగుదల నమోదు కాగా... సర్వికల్ క్యాన్సర్ ఒకశాతం మేరా పెరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
2016 నుంచి 2018 వరకు పెరిగిన క్యాన్సర్ కేసులు
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం భారత్లో 2016లో 1,42,000 బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు రికార్డు కాగా... అదే 2018 నాటికి ఆ సంఖ్య 1,60,000 కు పెరిగింది. ఇక సర్వికల్ క్యాన్సర్ కేసులు చూస్తే 2016 నాటికి 99,000 కేసులు రికార్డు కాగా... 2018 నాటికి లక్ష కేసులు నమోదయ్యాయి. ఇక క్యాన్సర్ విభాగంలో చూస్తే ప్రధానంగా మూడు క్యాన్సర్ వ్యాధులతో ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. అవి బ్రెస్ట్క్యన్సర్, సర్వికల్ క్యాన్సర్ మరియు ఓరల్ క్యాన్సర్.
స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
క్యాన్సర్కు సంబంధించి సర్వికల్, ఓరల్, బ్రెస్ట్ క్యానర్స్లతో పాటు డయాబెటిస్, హైపర్ టెన్షన్ (బీపీ) నియంత్రించేందుకు ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం కింద 215 జిల్లాల్లో స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. దీని ప్రకారం 30 ఏళ్లు పైబడిన వారికి టెస్టులు నిర్వహిస్తారు. నాన్ కమ్యునికబుల్ డిజీస్తో పాటు క్యాన్సర్ వ్యాధులకు పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా స్థాయిలో 599 క్లినిక్లు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 3,274 క్లినిక్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది..?
క్యాన్సర్కు కారణమయ్యే పొగాకు ఉత్పత్తులను వినియోగించరాదని కేంద్ర ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రయత్నం చేస్తోంది. సర్వికల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ల నివారణకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక క్యాన్సర్ నివారణకు కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్ కేంద్రాలను బలోపేతం చేయడంతోపాటు, 18 రాష్ట్రాల్లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లను ఏర్పాటు చేయనుంది. అంతేకాదు 20 క్యాన్సర్ సంరక్షణ కేంద్రాలను కూడా పెట్టనున్నట్లు సమాచారం. ఇక ఈ వరల్డ్ క్యాన్సర్ డే నినాదం "ఐ యామ్ అండ్ ఐ విల్". దేశంలో ప్రతి వ్యక్తి క్యాన్సర్పై పోరాడేందుకు ముందుకు రావాలని కేంద్రం పిలుపునిస్తోంది.