వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు సర్వం సిద్ధం.. దావోస్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మోడీ!
వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఈ సదస్సు ప్రారంభ ఉత్సవాలు సోమవారం సాయంత్రం అట్టహాసంగా జరగనున్నాయి. మంగళవారం నుంచి మొదలయ్యే సదస్సులో ప్రధాని మోడీ తొలి ఉపన్యాసం ఇస్తారు.
న్యూఢిల్లీ: వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఈ సదస్సు ప్రారంభ ఉత్సవాలు సోమవారం సాయంత్రం అట్టహాసంగా జరగనున్నాయి. మంగళవారం నుంచి మొదలయ్యే సదస్సులో ప్రధాని మోడీ తొలి ఉపన్యాసం ఇస్తారు.
స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి హాజరయ్యే అతిథులకు రుచికరమైన భారతీయ వంటకాలు కూడా సిద్ధమయ్యాయి.
సదస్సు జరిగినన్ని రోజులు యోగా శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ 48వ డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి వ్యాపార, రాజకీయ, కళారంగాలకు చెందిన మూడు వేల మందికి పైగా ప్రముఖులు హాజరవుతున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి భారత్ నుంచి 130 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. సదస్సు సందర్భంగా బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్, ఆస్ట్రేలియన్ నటి కేట్ బ్లాన్చెట్, ప్రముఖ సంగీతకారుడు ఎల్టన్ జాన్లను క్రిస్టల్ అవార్డులతో సత్కరించనున్నారు.
ముక్కలైన ప్రపంచంలో ఉమ్మడి భవిష్యత్తు నిర్మాణం అనేది సదస్సు ప్రధాన ఎజెండా. ప్రధాని నరేంద్ర మోడీ చేసే ప్రసంగంతో సదస్సు అధికారికంగా ప్రారంభమవుతుంది. 1997లో అప్పటి ప్రధాని హెచ్డీ దేవెగౌడ అనంతరం దావోస్ సదస్సుకు హాజరవుతున్న మొదటి భారత ప్రధాని మోడీనే.
మరోవైపు సోమవారం సాయంత్రం మోడీ ... ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీఈవోలకు విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భారత్కు చెందిన 20 కంపెనీలు, 40 విదేశీ కంపెనీల సీఈవోలు పాల్గొన్నారు.
భారత్ స్వేచ్ఛా వాణిజ్య దేశమనీ.. పెట్టుబడులకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని ప్రపంచ దేశాలకు ప్రధాని స్పష్టం చేయనున్నారు. అలాగే అంతర్జాతీయ వ్యాపార కూటమికి చెందిన 120 మంది సభ్యులతోనూ మోడీ సమావేశమవుతారు.
స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. మోడీ వెంట కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సురేశ్ ప్రభు, పియూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ఎంజే అక్బర్, జితేందర్ సింగ్లు కూడా దావోస్ సదస్సులో పాల్గొంటున్నారు.
ఇక భారతీయ పరిశ్రమల విభాగం సీఐఐ నేతృత్వంలోని సీఈవోల బృందంలో ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, అజీం ప్రేమ్జీ, రాహుల్ బజాజ్, ఎన్.చంద్రశేఖరన్, చందా కొచ్చర్, ఉదయ్ కొటక్, అజయ్ సింగ్లు సదస్సుకు హాజరవుతున్నారు. మోడీతో పాటు సదస్సులో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, షారుక్ ఖాన్లు కూడా ప్రసంగిస్తారు.