ముదురుతోన్న 'ఐటీ' సంక్షోభం: 'కోటి' ఉద్యోగాలు గల్లంతే!, భవిష్యత్తు హెచ్చరిక..
యాంత్రీకరణ పెరుగుతున్న కొద్ది మనుషులకు ఉపాధి కొరత ఏర్పడుతోంది. రానున్న రోజుల్లో యాంత్రీకరణ మరింత కొత్త పుంతలు తొక్కనుండటంతో దాదాపు కోటి ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రమాదముందని ప్రపంచ ఆర్థిక వేదిక
న్యూఢిల్లీ: యాంత్రీకరణ పెరుగుతున్న కొద్ది మనుషులకు ఉపాధి కొరత ఏర్పడుతోంది. రానున్న రోజుల్లో యాంత్రీకరణ మరింత కొత్త పుంతలు తొక్కనుండటంతో దాదాపు కోటి ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రమాదముందని ప్రపంచ ఆర్థిక వేదిక ఒక ప్రకటనలో తెలిపింది. ఈ లెక్కన ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో సగం వరకు గల్లంతవుతాయని పేర్కొంది.
దీన్ని బట్టి చూస్తే.. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో అత్యధిక నైపుణ్యం కలిగిన వారు మాత్రమే భవిష్యత్తులో తమ పోస్టును కాపాడుకుంటారు. లేదంటే, కంపెనీలే వారిని ఇంటికి సాగనంపడం ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు. అంతేకాదు, ఇంతకుముందులా.. ఈ కంపెనీ కాకపోతే మరో కంపెనీ అన్న ప్రస్తావన కూడా ఉండదని, ఎక్కడికెళ్లినా ఇలాంటి గడ్డు పరిస్థితులే ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రపంచ ఆర్థిక వేదిక హెచ్చరిస్తోంది.
కారణాలివే:
ఇంతలా కోటి ఉద్యోగాలు కనుమరుగవడానికి గల కారణాలను పరిశీలిస్తే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, రోబోటిక్స్, త్రీడీ ప్రింటింగ్, వంటి అత్యాధునిక కమ్యూనికేషన్ వల్లే ఈ పరిస్థితి తలెత్తుతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే మూడు, నాలుగేళ్లలోనే ఈ ఉపాధి సంక్షోభం ఏర్పడనున్నట్లు ప్రపంచ ఆర్థిక వేదిక తెలిపింది.
రోడ్డున పడాల్సిందేనా?:
ఉన్నఫలంగా ఉద్యోగాలు కోల్పోతే కోటి మంది ఉద్యోగాలు ఒక్కసారిగా దిక్కుతోచని స్థితిలో రోడ్డున పడుతారు. నిజానికి కోల్పోయే ఉద్యోగాల స్థానంలో మరో రెండు కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి రావాల్సి ఉండగా, కేవలం 30 నుంచి 50 లక్షల ఉద్యోగాలు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.
కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిందే:
ఐటీ ఫీల్డ్ లో ఎప్పటికప్పుడు నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటేనే ఉద్యోగానికి భద్రత ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న టెక్నాలజీకి అనుగుణంగా ఉద్యోగులు తమ పని తనాన్ని మెరుగుపరుచుకుంటేనే ఉద్యోగాలు కాపాడుకున్నవారవుతారు.
పింక్ స్లిప్ భయం:
ఉద్యోగాల గల్లంతు భయంతో చాలామంది ఐటీ ఉద్యోగులకు పింక్ స్లిప్ల భయం పట్టుకుంది. అడాప్టివ్ థింకింగ్, డేటా ఇంటెలిజెన్స్, ఎనలైజేషన్, వంటి స్కిల్స్ను మెరుగుపరుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.