భారత ప్రధాని మోడీని ప్రశంసించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ... రీజన్ ఇదే !!
భారత ప్రధాని నరేంద్ర మోడీని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ కొనియాడారు. కరోనా మహమ్మారి నియంత్రణ కోసం సాగిస్తున్న పోరులో భాగంగా వివిధ దేశాలకు సహాయం చేసేందుకు భారత్ ముందుకు వచ్చిన విధానాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొనియాడింది . వ్యాక్సిన్ సరఫరాపై అంతర్జాతీయ వేదికపై భారత ప్రధానమంత్రి ఇచ్చిన హామీని డబ్ల్యూహెచ్వో ప్రశంసించింది.
రైతుల సంక్షేమం కోసం సంస్కరణలు ,ఎంఎస్పీ పెంచటంలో ఎన్డీఏదే హిస్టరీ : ప్రధాని మోదీ
వ్యాక్సిన్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న భారతదేశం ప్రపంచ దేశాలకు సహాయపడుతుందని మోడీ ఇచ్చిన హామీపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా, భారత్ నిబద్ధతను కొనియాడారు. ప్రపంచాన్ని కరోనా బారి నుండి రక్షించడం కోసం మన దగ్గర ఉన్న వనరులను, శక్తులను కలిసికట్టుగా సమీకరించడం ద్వారా, సమిష్టి పోరాటం చెయ్యటం ద్వారా మహమ్మారికి ముగింపు పలకగలమని ఈ సందర్భంగా పేర్కొన్నారు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రోస్.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ ఇండియాలో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మానవాళికి సహాయపడటానికి భారత దేశం వ్యాక్సిన్ ఉత్పత్తి , సరఫరా సామర్ధ్యాన్ని పెంచుకుంటున్నదని, ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అంతర్జాతీయ వేదికపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే భారత్ లో కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు మూడవ దశకు చేరుకోగా,ఇప్పటివరకు సానుకూల ఫలితాలు వచ్చినట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
అంతేకాదు కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న సమయంలోనూ భారత ఫార్మా పరిశ్రమ ఇతర దేశాలకు పెద్ద ఎత్తున సహకరించిందని, 150 దేశాలకు అత్యవసర మందులు పంపించిందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కరోనా కష్టకాలంలో ప్రపంచానికి సహకరిస్తున్న భారతదేశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసల జల్లు కురిపిస్తోంది. కరోనా సమరంలో కీలక పాత్ర పోషిస్తున్న భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీని సైతం అభినందిస్తోంది.