ప్రపంచంలోనే 15 హాటెస్ట్ నగరాలు మనవద్దే: తెలంగాణ నుంచి ఒకటి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడాదికేడాది ఎండ తీవ్రత గణనీయంగా పెరుగుతోంది. ఏటా వేసవి కాలం సమీపించే నాటికి కనీసం ఒక డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ సారి కూడా దీనికి భిన్నమైన పరిస్థితులేమీ కనిపించట్లేదు. వేసవి సమీపించిందంటే- చండ ప్రచండమైన ఎండ తీవ్రత రికార్డవుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్న నగరాల జాబితాలో.. 15 సిటీలు మనదేశానికి చెందినవే కావడం ఆందోళనకరంగా మారింది. ఈ 15 నగరాల్లో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం టాప్ లో ఉంది. విదర్భ ప్రాంతానికి ఆరు నగరాలు ఈ జాబితాలో చేరాయి. అలాగే- విదర్భకు ఆనుకుని ఉండే ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ కు కూాడా ఈ జాబితాలో బెర్త్ దక్కింది.
వాతావరణానికి సంబంధించిన వార్తలను మాత్రమే ప్రచురించే ఎల్ డొరాడో అనే వెబ్ సైట్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే నగరాలపై సర్వే చేసింది. అనంతరం- ఆయా నగరాల జాబితాను ప్రకటించింది. అత్యధికంగా 15 నగరాలతో మనదేశం ఈ జాబితాలో టాప్ లో ఉంది. శుక్రవారం ఒక్కరోజే దేశం నిప్పుల కుంపటిని తలపించిందని వెబ్ సైట్ పేర్కొంది. ఈ 15 నగరాల్లో మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ ప్రాంతం టాప్ లో ఉంది. అక్కడ శుక్రవారం నాడు 46.6 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రత నమోదైంది.
ఒక బస్సు పోయాక తేరుకున్న ఆర్టీసీ ! స్టీరింగ్లకు తాళాలు !
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన అకోలా-46.4, నాగ్ పూర్-45.2, అమరావతి (మహారాష్ట్ర)-45.4, బ్రహ్మపురి -45.8, చంద్రాపూర్-45.6, వార్ధా-45.7లు అధిక ఉష్ణోగ్రతను నమోదు చేసుకున్నట్లుగా ఎల్ డొరాడో వెబ్ సైట్ వెల్లడించింది. ఖర్గోన్ తో పాటు మధ్యప్రదేశ్ లో మూడు, ఉత్తర్ ప్రదేశ్ లో రెండు, తెలంగాణ నుంచి ఆదిలాబాద్ ఈ జాబితాలో ఉన్నాయి. 47 డిగ్రీల వరకు ఎండ తీవ్రత ఉన్నప్పటికీ.. ప్రజలు బయట తిరగొచ్చని, ఈ స్థాయిని మించి ఎండ తీవ్రత అధికరంగా నమోదవుతే బయట తిరగ కూడదని సూచించింది. 47 డిగ్రీల ఉష్ణోగ్రతను మించి ఎండ మనిషిలో శక్తిని హరించి వేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అది ప్రాణాంతకంగా మారుతుందని చెప్పారు.