ఎగ్జిట్ పోల్స్తో ఆందోళనలో ఆప్.. ఓట్ షేర్ తగ్గడంపై టెన్షన్ టెన్షన్..
ఢిల్లీ : ఎగ్జిట్ పోల్ ఫలితాలు బీజేపీ మినహా దాదాపు అన్ని పార్టీలను కలవరపెడుతున్నాయి. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లోనూ లోక్సభ ఎన్నికల్లో జనం ఆ పార్టీకే జై కొట్టారన్న అంచనాలు నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఢిల్లీలో మరోసారి బీజేపీ ప్రభంజనం ఖాయమని ఏడింటిలో కేవలం ఒకే ఒక్క స్థానం ఆప్కు దక్కనుందన్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం, సార్వత్రిక సమరంలో కాంగ్రెస్ ఓట్ షేర్ పెరగడం ఆందోళనను మరింత పెంచుతోంది.
షాకింగ్ : అమేథీలో రాహుల్ గెలుపు కష్టమే... వాయనాడ్లో పరిస్థితి ఏమిటి..?
ఒక్క సీటు వస్తుందంటున్న సర్వేలు
ఢిల్లీలో మొత్తం 7 లోక్సభ స్థానాలున్నాయి. ఆదివారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్లో మెజార్టీ సంస్థలు బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పారు. ఆమ్ ఆద్మీ కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితం కావచ్చని అంచనా వేశాయి. మరోవైపు గత ఎన్నికలతో పోలిస్తే ఢిల్లీలో కాంగ్రెస్ బలం పుంజుకుంటోందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ఇది ఆప్ ఆందోళనను మరింత పెంచుతోంది.
కాంగ్రెస్ ఓట్ షేర్ 30 శాతం
వివిధ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 17 నుంచి 20శాతం ఓటర్ల మద్దతు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు 30శాతానికి చేరింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ముఖ్యంగా ముస్లింలు ఆమ్ ఆద్మీ వైపు మొగ్గారు. ఫలితంగా కాంగ్రెస్ ఓట్ షేర్ 15శాతానికి పడిపోగా... ఆప్ ఓటు షేర్ 33శాతానికి ఎగబాకింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే కనిపించింది. తాజా ఎగ్జిట్ పోల్ అంచనాలను బట్టి గతంలో ఆప్కు మద్దతిచ్చిన ఓటర్లంతా మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. చివరి నిమిషంలో ముస్లిం ఓటర్లు కాంగ్రెస్కు ఓటేశారని అంటున్నారు.
2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన ఏడాదిలోపే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 70స్థానాలున్న శాసనసభలో 2015లో ఆప్.. ఎవరూ ఊహించని రీతిలో 67సీట్లు తన అకౌంట్లో వేసుకుని ప్రభంజనం సృష్టించింది. తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్లో ఆమ్ ఆద్మీ పరిస్థితి దారుణంగా మారడం ఆ పార్టీలో ఆందోళన పెంచుతోంది. బీజేపీ, కాంగ్రెస్ బలం పుంజుకోవడం వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్పై ప్రతికూల ప్రభావం చూపుతోందని భయపడుతోంది.