సీఎం చేతులు పట్టుకొని అడిగా, సమాధి అయ్యేవాడిని: స్టాలిన్, పార్టీ ఛీఫ్పై కరుణ తేల్చారు!
చెన్నై: మెరీనా బీచ్లో కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించక పోయి ఉంటే ఆయనతో పాటు తాను కూడా సమాధి అయి ఉండేవాడినని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరుణానిధి వంటి గొప్ప నేతను పార్టీ కోల్పోతే, తాను తండ్రిని కోల్పోయానని చెప్పారు.
కరుణానిధి ఆశయాల కోసం కార్యకర్తలు అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మెరీనా బీచ్లో కరుణానిధి సమాధి ఏర్పాటు చేయాలన్న తన తండ్రి చివరి కోరికను ముఖ్యమంత్రి పళనిస్వామికి చెప్పానని, కానీ దానిని ఆయన తోసిపుచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
మెరీనా బీచ్ కోసం సీఎం చేతులు పట్టుకొని వేడుకున్నా
కరుణానిధి చివరి క్షణాల్లో తాను ముఖ్యమంత్రి పళనిస్వామి చేతులు పట్టుకొని మెరీనా బీచ్లో సమాధి చేయాలన్న కరుణ చివరి కోరికను ఆయన దృష్టికి తీసుకు వెళ్లానని, అంగీకరించాలని వేడుకున్నానని, కానీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా తమ అభ్యర్థనను తోసిపుచ్చిందని మండిపడ్డారు.
స్టాలిన్ ఉద్వేగం
మెరీనా బీచ్లో కరుణానిధి అంత్యక్రియలకు న్యాయస్థానం కనుక పచ్చ జెండా ఊపకుంటే తన తండ్రితో పాటు తాను చనిపోయేవాడినని చెప్పారు. మెరీనా బీచ్లో అంత్యక్రియలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ దక్కడం వెనుక క్రెడిట్ లాయర్లకే దక్కుతుందని తెలిపారు. అదే జరిగి ఉండకుంటే తాను తన తండ్రి పక్కనే సమాధి అయ్యేవాడినని ఉద్వేగంగా అన్నారు.
స్టాలిన్కు ఆ లక్షణాలు
డీఎంకే పార్టీలో స్టాలిన్, అళగిరిల మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైన విషయం తెలిసిందే. కరుణ మృతి తర్వాత పార్టీ కార్యకర్తలతో తొలిసారి స్టాలిన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు మీరే పార్టీని లీడ్ చేయాలని కోరారు. కేంద్ర మాజీ మంత్రి టీఆర్ బాలు మాట్లాడుతూ.. ఆర్మీ కమాండర్ (పార్టీ చీఫ్) చనిపోయారని, కాబోయే కమాండర్ ఎవరో చెప్పే హక్కు ఎవరికీ లేదని అళగిరిని ఉద్దేశించి అన్నారు. కేవలం స్టాలిన్కు మాత్రమే పార్టీని నడిపే లక్షణాలు ఉన్నాయని చెప్పారు.
అళగిరిని పంపించేశారు.. కాబట్టి
కరుణానిధి జీవించి ఉన్నప్పుడే అళగిరిని పార్టీ నుంచి బహిష్కరంచారని కొందరు డీఎంకే నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. కాబట్టి డీఎంకే చీఫ్ ఎవరనేది ఇప్పటికే తేలిపోయిన అధ్యాయం అని అంటున్నారు. స్టాలిన్ మాత్రమే పార్టీ అధినేత అని చెబుతున్నారు.