ఇండియాలో ఉంటే నాకు నోబెల్ రాకపోయేది.. మన సిస్టమ్ మారాలి: ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ
చాలా మంది తెలివైనవాళ్లు, అద్భుతమైన ప్రతిభావంతులు ఉండి కూడా ఇండియా గొప్ప స్థాయిలో లేకపోవడం బాధాకరమని.. టాలెంట్ ను గుర్తించి, దాన్ని ప్రోత్సహించే వ్యవస్థ ఇక్కడలేదని.. ప్రస్తుతం కొనసాగుతున్న సిస్టమ్ చాలా మారాల్సిన అవసరముందని ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ అన్నారు. ఒకవేళ తాను అమెరికాకు వెళ్లకుండా ఇండియాలోనే ఉండేదుంటే ఎప్పటికీ నోబెల్ ప్రైజ్ వచ్చేదేకాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అప్పుడే బాగుంటుంది..
ఇండియన్ అమెరికన్ ఎకానమిస్ట్ అభిజిత్ బెనర్జీ తన భార్య ఎస్తేర్ డుఫ్లోతో కలిసి ఆదివారం జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్(జేఎల్ఎఫ్)లో పాల్గొన్నారు. ఎకానమీపై జరిగిన సెషన్ లో ఆయన మాట్లాడారు. నోబెల్ లాంటి పురస్కారాలు వ్యక్తులకు నేరుగా దక్కేవికాదని, ఎంతో మంది చేసిన కృషికి కొనసాగింపే తన పరిశోధనలని బెనర్జీ చెప్పారు. వ్యవస్థ మొత్తం సహకరించే పరిస్థితి ఉన్నప్పుడే పరిశోధనలు అద్భుతంగా సాగుతాయన్నారు.
నిరంకుశత్వం.. ఆర్థిక ప్రగతి
ఒక దేశం నిరంకుశ పాలన ఉన్నంత మాత్రాన ఆర్థిక ప్రగతి కుంటుపడే పరిస్థితి ఉండబోదని, సింగపూర్, చైనా లాంటి దేశాలు అందుకు ఉదాహరణలని అభిజిత్ తెలిపారు. ఉచిత పథకాలు, నగదు సహాయం తదితర సంక్షేమ కార్యక్రమాల వల్ల పేదలు సోమరిపోతుల్లా మారుతారన్న వాదనను ఆయన ఖండించారు. పథకాల ద్వారా లాభం పొందే పేదలు కనీసం 10 ఏళ్లలోనైనా పేదరికం నుంచి బయటపడతారని, బంగ్లాదేశ్ లో అది ప్రాక్టికల్ గా జరిగిందని ఆయన గుర్తుచేశారు.
ప్రతిపక్షం బలంగా ఉండాలి..
దేశం అన్ని రకాలుగా బాగుండాలంటే బలమైన ప్రతిపక్షం ఉండాలని.. ఆమేరకు ప్రభుత్వాలు కూడా సహకరించాల్సిఉంటుందని బెనర్జీ అన్నారు. ఇప్పటికిప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ పిలిచి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా అవకాశం కల్పిస్తే నో చెబుతానని, ఆ పదవికి మాక్రో ఎకానమిస్టులే సూటవుతారని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
ముంబై టు మసాచుసెట్స్
ముంబయిలో 1961లో జన్మించిన అభిజిత్ బెనర్జీ.. కలకత్తా, జేఎన్యూ, హార్వర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీల్లో చదువుకుని, ప్రస్తుతం మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎకనమిక్స్లో 'ఫోర్డ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ప్రొఫెసర్'గా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలన కోసం కృషి చేసినందుకుగానూ అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తేర్ డఫ్లో, మరొక ఆర్థిక వేత్త మైఖేల్ క్రెమెర్ కు నోబెల్ పురస్కారం దక్కింది.