కోజికోడ్ విమాన ప్రమాదం: శిథిలాలను భద్రపరిచిన అధికారులు..శాటిలైట్ ఫోటోస్ విడుదల.!
కోజికోడ్: గతవారం దుబాయ్ నుంచి కోజికోడ్కు టేకాఫ్ తీసుకున్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకోగానే క్రాష్ ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. అయితే విమాన ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ మిగిలిపోయిన శిథిలాలను ఉపగ్రహం బంధించింది. విమాన ప్రమాదం తర్వాత ఆ భారీ బోయింగ్ విమానంను నీలిరంగు కవర్తో కప్పేసినట్లుగా ఉపగ్రహం విడుదల చేసిన చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రమాదం జరిగినప్పుడు రెండు ముక్కలుగా విమానం విరిగిపోయింది. ముందు భాగం మొత్తం విమానం నుంచే వేరైపోయింది. ఈ ఉపగ్రహ చిత్రాలను ప్రముఖ అంతరిక్ష సంస్థ మక్సర్ టెక్నాలజీస్ మంగళవారం రోజున తీసింది.
ఇక ఈ ఫోటోస్ను జాగ్రత్తగా పరిశీలిస్తే వాతావరణం నుంచి దీన్ని జాగ్రత్తగా భద్రపరిచినట్లు తెలుస్తోంది. దర్యాప్తు ప్రారంభమైనందున ఈ విమానంను సురక్షితంగా ఉంచాలని భావించి అధికారులు దాన్ని శిథిలాలను భద్రపరిచినట్లు తెలుస్తోంది. రన్వేకు కాస్త దూరంలో ఈ విమానం నీలిరంగు కవర్తో కప్పబడిఉంది. విమానం సంగతి అటుంచితే ఘటనా స్థలంలో ఓ రెండు క్రేన్లు, ఒక ట్రక్కులు ఉన్నట్లుగా శాటిలైట్ ఫోటోస్లో కనిపిస్తోంది. అంటే దర్యాప్తు కొనసాగుతోందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఫ్లయిట్ ఐఎక్స్ -1344 దుబాయ్ నుంచి కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ఆగష్టు 7వ తేదీన బయలుదేరింది. ఆ విమానంలో 190 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ల్యాండింగ్ సమయంలో రన్వేపై విమానం స్కిడ్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లతో సహా 18 మంది దుర్మరణం చెందారు. మరో 30 మంది గాయపడ్డారు. ఘటనపై దర్యాప్తునకు డీజీసీఏ ఆదేశించింది. ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైంది.
Recommended Video
ఇక విమానంలో కీలకంగా వ్యవహరించే బ్లాక్ బాక్స్ను విచారణాధికారలు స్వాధీనం చేసుకున్నారు. ఈ బ్లాక్బాక్స్ను డీకోడ్ చేస్తే ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంతవరకు ఎలాంటి వదంతులు పుట్టించరాదని కేంద్ర పౌరవిమానాయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నందున ప్రమాదం పై ఎలాంటి ప్రకటన చేయలేమని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చీఫ్ అరబిందో హందా చెప్పారు. ప్రస్తుతం ఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నట్లు ఆయన చెప్పారు.