సుశీల్ కుమార్ కొట్టడం వల్లే మృతి? -ఢిల్లీ స్టేడియంలో ప్లేయర్ల ఘర్షణ -యువ రెజ్లర్ సాగర్ దారుణ హత్య
కరోనా దెబ్బకు ఐపీఎల్ రద్దు తర్వాత క్రీడాలోకాన్ని షాక్ కు గురిచేసిన మరో సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ప్రఖ్యాత ఛత్రసాల్ స్టేడియం వద్ద రెండుగా విడిపోయిన రెజ్లర్లు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో యువ రెజ్లర్ సాగర్ కుమార్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఒలింపియన్ రెజ్లర్ సుశీల్ కుమార్ ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తోన్న పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వివరాలివి..
క్రీడా ప్రాంగణాల్లో ప్లేయర్ల ప్రాక్టీస్ కు అనుమతి కొనసాగుతున్న దరిమిలా ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో కొందరు ప్లేయర్లు శిక్షణకు హాజరవుతున్నారు. అయితే, మంగళవారం రాత్రి మంగళవారం రాత్రి రెండు వర్గాల రెజ్లర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఒలింపిక్ మెడల్ విజేత సుశీల్ కుమార్ నాయకత్వంలోని వర్గం అవతలివారిపై దాడి, కాల్పులు జరపడంతో ఓ యువ రెజ్లర్ చనిపోయాడు.
చనిపోయిన రెజ్లర్ ను 23 ఏళ్ల సాగర్ కుమార్ గా గుర్తించారు. అతను జూనియర్ నేషనల్ ఛాంపియన్ అని, తదుపరి టోర్నీల కోసం ఛత్రసాల్ స్టేడియంలో శిక్షణ పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఉదంతంపై సుశీల్కుమార్తోపాటు మరికొందరిపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హత్యతో తనకు సంబంధం లేదని సుశీల్ చెబుతున్నప్పటికీ అతని కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
ఛత్రాసాల్ స్టేడియంలో ఘర్షణ, హత్య విషయం తెలుసుకున్న తర్వాత సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు ఐదు వాహనాలు, ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ గురిఖ్బాల్ సింగ్ సిద్ధు మీడియాకు తెలిపారు. హత్య కేసులో స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ పాత్రను పరిశీలిస్తున్నామని.. ప్రస్తుతానికి అతడి పేరును ఎఫ్ఐఆర్లో పొందుపరిచామని.. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీసీపీ పేర్కొన్నారు.