కరోనా : ఢిల్లీలో ఘోర పరిస్థితులు.. మృతదేహాల తారుమారు ఘటనలో గుండెను మెలిపెట్టే నిజాలు..
కరోనా వైరస్ పేషెంట్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారని.. ఓ మృతదేహాన్ని చెత్త కుప్పలో పడేయడం ఇందుకు నిదర్శనమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాశ్ కోవిడ్-19 ఆస్పత్రిలో.. వార్డుల్లోనే కాదు.. లాబీల్లోనూ కరోనా మృతదేహాలు దర్శనమిస్తున్నాయని పేర్కొంది. సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటిరోజే.. ఎల్జేఎన్పీ ఆస్పత్రిలో తమవాళ్ల మృతదేహాలు తారుమారుయ్యాయని రెండు కుటుంబాలు ఆరోపించాయి. ఆస్పత్రిలో సరైన చికిత్స అందించకపోవడమే కాదు... ఆఖరికి తమవాళ్ల మృతదేహాలకు అంత్యక్రియలు కూడా నిర్వహించుకోలేకపోయామని వాపోయారు.
అంత్యక్రియలు నిర్వహించాక ఫోన్..
సన్నీ చంద్ర అనే సీఐఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. 'జూన్ 7వ తేదీ ఉదయం మా తండ్రి సంత్ రామ్ మృతదేహాన్ని ఆస్పత్రి సిబ్బంది అంబులెన్సులో నిగంబోధ్ ఘాట్ వద్దకు తీసుకొచ్చి మాకు అప్పగించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించాం. కానీ ఆ తర్వాత కొన్ని గంటలకే ఆస్పత్రి నుంచి నాకు ఫోన్ వచ్చింది. తనకు అప్పగించిన మృతదేహం మరో మహిళది అని ఆస్పత్రి సిబ్బంది పేర్కొన్నారు.' అని చెప్పుకొచ్చారు.
ముఖం చూసేందుకు అంగీకరించకపోవడంతో..
జూన్ 6వ తేదీన ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో తమ తండ్రి మృతి చెందాడని వైద్యులు తెలిపారు. డెత్ సర్టిఫికెట్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధితో మృతి చెందినట్టు పేర్కొన్నారు. అనంతరం ఓ వస్త్రంలో కప్పి ఉంచిన డెడ్ బాడీని అప్పగించారని.. దానిపై ఉంచిన ఒక పేపర్లో పేరు,వయసు,జెండర్ ఇతరత్రా వివరాలను రాసి ఉంచారని తెలిపారు. ఆ తర్వాత ఒక్కో అంబులెన్సులో 4,5 మృతదేహాలను ఉంచి నిగంబోధ్ ఘాట్కి తరలించినట్టు చెప్పారు. అక్కడ పేపర్ వర్క్ పూర్తి చేశాక తమకు మృతదేహాన్ని అప్పగించారని.. అయితే అంబులెన్స్ అటెండెంట్ డెడ్ బాడీ ముఖాన్ని చూసేందుకు అంగీకరించలేదని తెలిపారు. దీంతో ముఖం చూడకుండానే అంత్యక్రియలు నిర్వహించామన్నారు.
ఆస్పత్రి నుంచి ఫోన్ రావడంతో..
అంత్యక్రియల అనంతరం ఇంటికి బయలుదేరగా.. మార్గమధ్యలో ఎల్ఎన్జేపీ ఆస్పత్రి నుంచి తమకు ఫోన్ కాల్ వచ్చిందన్నారు. మృతదేహాలో అప్పగింతలో కన్ఫ్యూజన్ కారణంగా పొరపాటు జరిగిందని వారు చెప్పినట్టు తెలిపారు. దీంతో వెంటనే మళ్లీ ఆస్పత్రికి వెళ్లగా.. అప్పటికీ తమ తండ్రి మృతదేహం అంబులెన్సులోనే ఉన్నట్టు గుర్తించామన్నారు. నిజానికి తమకు అప్పగించిన డెడ్ బాడీపై ఎలాంటి నోట్ కూడా లేదని.. ముఖం చూసేందుకు కూడా అనుమతించకపోవడంతో.. మీరా దేవీ అనే మరో మహిళ డెడ్ బాడీకి తాము అంత్యక్రియలు నిర్వహించామని అన్నారు.
మీరా దేవి కుమారుడు ఏమంటున్నారు..
మీరా దేవీ కుమారుడు ముకేష్ మాట్లాడుతూ.. 'జూన్ 4న మా అమ్మకు తలనొప్పి రావడంతో మాలవియ నగర్ ఆస్పత్రికి తీసుకెళ్లాం. కరోనా సోకిందన్న అనుమానంతో అక్కడినుంచి రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. వెనకాలే మా వాహనంలో అంబులెన్సును ఫాలో చేస్తూ వెళ్లాం. కానీ అంబులెన్స్ డ్రైవర్ ఆమె ఎల్ఎన్జేపీ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. మాలవియ ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన రిపోర్టులను ఆ అంబులెన్స్ డ్రైవర్కే ఇచ్చాను. తీరా ఆస్పత్రికి వెళ్లాక మా అమ్మను ఏ వార్డుకు తీసుకెళ్లారో తెలియలేదు. ఆ రాత్రంతా ఆమె సమాచారం కోసం ఆస్పత్రి సిబ్బందిని అడుగుతూనే ఉన్నాను. కానీ వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు.' అని చెప్పుకొచ్చారు.
డిశ్చార్జి చేయాలని బతిమాలగా...
ఆ తర్వాత రెండు రోజులు చీఫ్ మెడికల్ ఆఫీసర్ దగ్గరి నుంచి వార్డు బాయ్ వరకూ ప్రతీ ఒక్కరి చుట్టూ తిరిగానని.. అయినా తన తల్లి సమాచారం మాత్రం లభించలేదని వాపోయారు. చివరకు కొంతమంది పారిశుద్ధ్య కార్మికులను ఆరా తీయగా తన తల్లి వార్డు నం.27లో ఉన్నట్టు చెప్పారన్నారు. ఎలాగోలా జూన్ 5న ఆమెతో ఫోన్లో మాట్లాడినట్టు చెప్పారు. అప్పటికీ ఆమెకు ఎటువంటి టెస్టులు చేయలేదని.. కనీసం తినేందుకు తిండి కూడా పెట్టలేదని అన్నారు. దీనిపై పోలీసులకు,సీఎంవో ఆఫీసుకు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేసినా లాభం లేకపోయిందన్నారు.
10 నిమిషాలకే మరణ వార్త..
జూన్ 6వ తేదీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కాళ్లపై పడి మరీ తన తల్లిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయాల్సిందిగా వేడుకున్నట్టు ముకేష్ చెప్పారు. చివరకు ఆయన ఒప్పుకున్నారని,తన తల్లిని డిశ్చార్జి చేసి ఇంటికి పంపిస్తామని చెప్పారని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత కేవలం 10 నిమిషాలకే ఆమె మరణ వార్తను మోసుకొచ్చారని.. వాళ్లే తన తల్లిని చంపేశారని దు:ఖంతో వాపోయాడు. ఇంత జరిగినా కనీసం తన తల్లి మృతదేహాన్ని అయినా తనకు అప్పగించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. జూన్ 7న తన తల్లి మృతదేహాన్ని చూపించిన ఆస్పత్రి సిబ్బంది.. డెడ్ బాడీని నిగంబోధ్ ఘాట్ వద్దకు పంపిస్తామని చెప్పడంతో.. అక్కడికి వెళ్లినట్టు చెప్పారు.
Recommended Video
అప్పటికే దహన సంస్కారాలు పూర్తి..
అక్కడికి వెళ్లాక అన్ని అంబులెన్సుల్లోనూ తన తల్లి మృతదేహం గురించి వెతికామని.. ఎక్కడా ఆమె మృతదేహం కనిపించలేదని అన్నారు. ఓ అంబులెన్సులో ఒకరి మృతదేహం కనిపించగా.. డ్రైవర్ను అడిగామని.. అతనేమో అది తన తల్లి మృతదేహం అని చెప్పాడన్నారు. కానీ నిజానికి అది సంత్ రామ్ మృతదేహం అని.. తిరిగి తాము ఆస్పత్రికి వెళ్లి సిబ్బందిని నిలదీయగా.. అప్పటికే తన తల్లి మృతదేహాన్ని పొరపాటున వేరేవాళ్లకు అప్పగించామని చెప్పారన్నారు. అంతేకాదు,అప్పటికే దహన సంస్కారాలు కూడా పూర్తయ్యాయని చెప్పారన్నారు.