జిన్ పింగ్ పర్యటన వల్ల పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు.. కానీ: కేంద్రమంత్రి జైశంకర్ కుమారుడి కామెంట్స్!
న్యూయార్క్: చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్ పింగ్ భారత పర్యటనపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ కుమారుడు ధృవ జైశంకర్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. జిన్ పింగ్ పర్యటన వల్ల భారత్ కు పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలోపేతం కావడానికి జిన్ పింగ్ పర్యటన ఉపయోగపడుతుందని అంచనా వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ-జిన్ పింగ్ మధ్య చోటు చేసుకునే శిఖరాగ్ర సమావేశం దౌత్య సంబంధాల మీదే ప్రధానంగా కేంద్రీకృతమైనట్లు కనిపిస్తోందని చెప్పారు.
వచ్చే నెలలో ఉత్తరకొరియాకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్..?
అమెరికాలోని వాషింగ్టన్ కేంద్రంగా కార్యకలాపాలను కొనసాగిస్తోన్న అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్) డైరెక్టర్ గా ధృవ జైశంకర్ పని చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల విదేశాంగ విధానాలు, పొరుగు దేశాల మధ్య దౌత్య సంబంధాల పరిశీలన, ఎగ్జిమ్ పాలసీ వంటి అంశాలపై అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన పరిశోధక సంస్థ ఇది. ప్రస్తుతం ధృవ జైశంకర్ ఈ సంస్థ డైరెక్టర్ గా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. పాకిస్తాన్ తో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మనదేశ పర్యటనకు రావడం ప్రాధాన్యత సంతరిచుకుందని, ప్రస్తుతం అన్ని దేశాల చూపు వారిద్దరి భేటీపై నిలిచిందని ధృవ జైశంకర్ తెలిపారు.
రెండు దేశాల మధ్య వాణిజ్య పరమైన అంశాలపై విస్తృత చర్చ జరిగే అవకాశాలు ఎంతమాత్రమూ లేవని చెప్పారు. రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యంపై కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయని, ఆయా అంశాలపై చర్చించడానికి రెండు దేశాలు పెద్దగా సుముఖంగా లేవని అన్నారు. భారత్ సహా 16 దేశాలు చైనాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రతిబంధకాల వల్ల భారత్ ఆర్థికంగా నష్టపోయిందని, ఈ లోటును భర్తీ చేసుకోవడానికి చైనాకు ఎగుమతులను మరిన్ని రంగాలకు విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
భారత్ బలంగా ఉన్న వ్యవసాయం, ఫార్మాసూటికల్స్ రంగానికి చెందిన ఉత్పత్తులను చైనాకు ఎగుమతి చేయడం వల్ల లోటును భర్తీ చేసుకోవచ్చని అభిప్రాయ పడ్డారు. ఆసియాలో అత్యంత శక్తిమంతమైన దేశాలుగా గుర్తింపు పొందిన భారత్-చైనాల మధ్యయ దౌత్య పరమైన సంబంధాలు ఆశించిన స్థాయిలో లేవనే విషయం బహిరంగ రహస్యమని, దీన్ని పటిష్టం చేసుకోవడంతో పాటు వాణిజ్య అంశాల్లో సఖ్యత సాధించడానికి తమవంతు ప్రయత్నాలు చేయాల్సి ఉందని చెప్పారు. చైనా భారత్ తో కాకుండా పాకిస్తాన్ తో దౌత్య సంబంధాల బలోపేతంపై దృష్టి సారించడం ఆందోళనకరమేనని, దీనికోసం భారత్ సరికొత్త విదేశాంగ విధానాలు, వ్యూహాలను రచించుకోవాలని సూచించారు.