ఎస్బీఐలో రూ.20 వేల నకిలీ నోట్లు, పోలీసుల అదుపులో వ్యక్తి
బెంగళూరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్యాంకులో ఓ వ్యక్తి నలభై రూ.500 నకిలీ నోట్లు తీసుకు వచ్చి డిపాజిట్ చెయ్యడంతో బెంగళూరులోని శేషాధ్రిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలి నోట్లు డిపాజిట్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
శేషాధ్రిపురంలో ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్ ఉంది. అదే ప్రాంతంలో ప్రయివేటు ఆడిట్ కంపెనీ ఉంది. ఈ కంపెనీలో మహారాష్ట్రకు చెందిన శైలేష్ యాదవ్ ఉద్యోగం చేస్తున్నాడు. గురువారం శైలేష్ యాదవ్ బ్యాంకులోకి వెళ్లాడు. రూ.8 లక్షలు ఉన్న నోట్ల కట్టలు తీసి క్యాషియర్ దగ్గరకు ఇచ్చాడు.
క్యాషియర్ నగదు పరిశీలిస్తున్న సమయంలో ఏకంగా రూ.20 వేల నకిలీ నోట్లు (రూ.500 నోట్లు 40) బయటపడ్డాయి. శైలేష్ యాదవ్కు అనుమానం రాకుండా క్యాషియర్ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్కు విషయం చెప్పారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు బ్యాంక్ వద్దకు వచ్చి, అతనిని అదుపులోకి తీసుకున్నారు.
తాను కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని, నకిలి నోట్లకు తనకు ఎలాంటి సంబంధం లేదని శైలేష్ యాదవ్ పోలీసులకు చెప్పారు. బ్యాంకు సిబ్బంది రూ.8 లక్షలలో 40 నకిలీ నోట్లు గుర్తించలేరనే ఉద్దేశ్యంతోనే నగదు డిపాజిట్ చెయ్యడానికి ప్రయత్నిచారని పోలీసులు అంటున్నారు.