యాకూబ్కు ఉరి: జస్టిస్ శ్రీకృష్ణ ఏమన్నారు?
ముంబై: ముంబైలో జరిగిన మతఘర్షణల కేసు, ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో అందరికి ఒకే న్యాయం ఉండాలని, నేరస్తులకు శిక్షపడాలని జస్టిస్ శ్రీకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతే కాని ఒక్కోక్కరికి ఒక్కోక్క న్యాయం ఉండే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించరాదని ఆయన అన్నారు.
జస్టిస్ శ్రీకృష్ణ ఒక జాతీయ న్యూస్ చానెల్ ( టీవీ)కి ఇచ్చిన ఇంటర్వూలో తన అభిప్రాయాలను వెల్లడించారు. 1992లో ముంబైలో జరిగిన మతఘర్షణలలో 900 మంది ప్రాణాలు పోయాయని అన్నారు. ఈ కేసులో ముగ్గురినే దోషులుగా గుర్తించారని చెప్పారు.
1993లో ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో 260 మంది మరణిస్తే 100 మందిని దోషులుగా గుర్తించారని గుర్తు చేశారు. అయితే ఎంత మంది చనిపోయారు, ఎంత మంది దోషులు అనేది ఇక్కడ ముఖ్యం కాదని దర్యాప్తు చేసిన తీరు ఆ విధంగా ఉందని అన్నారు.
ముంబై మతఘర్షణలో ఒక వర్గం వారు ఎక్కువ మంది మరణించారని అన్నారు. దోషులకు శిక్ష విధించే విషయంలో ప్రభుత్వాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. బాంబు పేలుళ్ల కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని చూపించిన శ్రద్ద మత ఘర్షణల కేసులో ఆసక్తి చూపించలేదని అన్నారు.
మతఘర్షణల కేసులో సాక్ష్యాలు ఉన్నా వాటిని న్యాయస్థానంలో సమర్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని చెప్పారు. అది కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి కానివ్వండి, బీజేపీ-శివసేన కూటమి కానివ్వండి, ఈ రెండు ఏకపక్షంగా వ్యవహరించాయని జస్టిస్ శ్రీకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు.
యాకూబ్ మెమెన్ ఉరితీతను సమర్థిస్తున్నానని జస్టిస్ శ్రీకృష్ణ అన్నారు. తుది నిమిషం వరకు సుప్రీం కోర్టు దోషికి అనేక అవకాశాలు కల్పించింది. సుప్రీం కోర్టు తుది తీర్పును తప్పుబట్టాల్సిన పని లేదని చెప్పారు. ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఉన్నప్పుడు ఏదో ఒక తీర్పు వెలువడుతుందని అన్నారు.
కోర్టులు అన్నీ సాక్షాధారాలు, వాటి నిరూపణ ఆధారంగానే పని చేస్తాయనే విషయం మనం గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. మతఘర్షణలకు ప్రతీకారంగా ముంబై వరుస బాంబు పేలుళ్లు జరిగాయి అనడం సమర్థనీయం కాదని జస్టిస్ శ్రీకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు.